పెళ్లి రోజే.. చివరి రోజు | Road accident in Kurnool district 4 dead | Sakshi
Sakshi News home page

పెళ్లి రోజే.. చివరి రోజు

Nov 30 2025 4:01 AM | Updated on Nov 30 2025 4:01 AM

Road accident in Kurnool district 4 dead

మృతులు వెంకటేషప్ప, సతీష్‌కుమార్, మీనాక్షి, రుత్విక్, బనిత్‌గౌడ్‌ (ఫైల్‌)

కర్నూలు జిల్లా కోటేకల్‌ వద్ద రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృత్యువాత

మంత్రాలయం దర్శనానికి వెళ్తుండగా ఘటన

మృతులంతా కర్ణాటకలోని కోలార్‌ జిల్లాకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు 

ఎమ్మిగనూరు రూరల్‌/ఎమ్మిగనూరు టౌన్‌: పెళ్లి రోజును మంత్రాలయంలో జరుపుకుందామని కుటుంబసభ్యులతో కలిసి కారులో బయలు­దేరిన భార్యభర్తలు.. రోడ్డు ప్రమాదంలో ప్రాణా­లు కోల్పో­యారు. వారితో పాటు మరో ముగ్గురు కుటుంబసభ్యులు కూడా దుర్మరణం చెందారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోటేకల్‌ గ్రామం కొండ మలుపు వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. 

వివరాలు.. కర్ణాటకలోని కోలార్‌ జిల్లా చిక్కహోసహళ్లి, బంగరుపేటకు చెందిన మీనాక్షి­(32), సతీష్‌కుమార్‌­(34) బెంగళూరులో సాఫ్ట్‌­వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తమ పెళ్లి రో­జును శనివారం కర్నూలు జిల్లా మంత్రాల­యంలో కొలువైన శ్రీ రాఘవేంద్రస్వామి సన్నిధి­లో జరుపుకో­వాలనుకు­న్నారు. కుమారుడు రుత్విక్‌­(4), మీనాక్షి తండ్రి వెంకటేషప్ప(76), తల్లి గంగమ్మ, అన్న కుమారుడు బనిత్‌(5), స్నేహితుడు చేతన్‌తో కలిసి శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో బయ­లుదేరారు.

అదే సమయంలో విజయనగ­రానికి చెందిన అశోక్, జాహ్నవి, రాధిక హైదరా­బాద్‌ నుంచి ఆదోనికి ఫార్చ్యునర్‌ కారులో వస్తున్నా­రు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఎమ్మిగనూరు మండలం కోటేకల్‌ కొండల వద్దకు వచ్చేసరికి స్విఫ్ట్‌కారు నడుపు­తున్న చేతన్‌ నిద్ర మత్తు, పొగమంచు వల్ల ఎదురుగా వస్తున్న ఫార్చ్యునర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సతీష్, మీనాక్షి దంపతులతో పాటు కుమారుడు రుత్విక్, బనిత్‌­గౌడ్, వెంకటేషప్ప అక్కడికక్కడే మరణించారు. 

చేతన్, గంగమ్మలకు తీవ్రగా­యాల­య్యాయి. ఫార్చ్యునర్‌లో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చేతన్, గంగమ్మను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘట­నాస్థలిని డీఐజీ కోయ ప్రవీణ్, అడ్మిన్‌ ఎస్పీ ఉసేన్‌ పీరా, డీఎస్పీ ఎంఎన్‌ భార్గవి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్, ఇన్‌చార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ అజయ్‌­కుమార్, తహసీల్దార్‌ శేష ఫణి పరిశీలించారు. మృతుల బంధువులను వైఎస్సార్‌సీపీ నాయ­కులు ఎర్రకోట రాజీవ్‌రెడ్డి, జగన్‌ పరా­మర్శించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు.

ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఎమ్మి­గనూరు మండలం కోటేకల్‌ వద్ద రెండు కార్లు ఢీకొని.. ఐదుగురు ప్రాణాలు కోల్పో­వడంపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. బాధితులను ఉదారంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement