
ప్రైవేట్ వాహనదారుల ఘర్షణ
ఉరవకొండ: స్థానిక టీడీపీ ముఖ్యనేత ఆశీస్సులతో కూడేరు మండలానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు ఏడాదిగా అనంతపురం – ఉరవకొండ మార్గంలో అనధికార షటిల్ సర్వీసులు నడుపుతూ ప్రయాణికులను దోచుకుంటున్నారని లైట్ మోటార్ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద ప్రైవేట్ వాహనాలను అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఇరు వర్గాల వాగ్వాదం చెలరేగి ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. అప్పులు చేసి, బంగారం కుదవ పెట్టి దాదాపు 150 మంది వాహనాలను కొనుగోలు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. తాము మూడు నెలలకు రూ.8.960 రోడ్ ట్యాక్స్ కట్టి, ఈఎంఐలు చెల్లిస్తున్నామన్నారు. టీడీపీ నేతల వాహనాలు కాదని ఇతరుల వాహనంలో ప్రయాణికులు ఎక్కబోతే దౌర్జన్యం చేస్తున్నారన్నారు. చివరకు ఆటోల్లో సైతం ప్రయాణికులను అనుమతించడం లేదన్నారు. తమతో పాటు గవిమఠంలోని వాహన స్టాండ్లో వాహనాలు పెట్టి క్రమ పద్ధతిలో బాడుగకు తిప్పుకుంటే అభ్యంతరం లేదన్నారు. అలా కాదని ఆర్టీసీ బస్టాండ్ వద్ద పెట్టి దోపిడీ చేయాలనుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై ఇప్పటికై నా ఆర్టీసీ, ఆర్టీఓ అధికారులు మేల్కొని చర్యలు చేపట్టాలని కోరారు.