
‘నవోదయ’ నిర్మాణానికి భూమిని గుర్తించండి
కళ్యాణదుర్గం/కళ్యాణదుర్గం రూరల్: పట్టణంలో జవహర్ నవోదయ విద్యాలయం నిర్మాణం కోసం అవసరమైన భూమిని గుర్తించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కళ్యాణ దుర్గం పట్టణ పరిధిలోని ధర్మవరం రోడ్డులో సర్వే నంబర్ 464లో 17.12 ఎకరాలు, సర్వే నంబర్ 465లో 1.35 ఎకరాలను, అలాగే, ఈస్ట్ కోడిపల్లి సమీపంలో సర్వే నంబర్ 389లోని 37.45 ఎకరాల భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవోదయ విద్యాలయం కోసం ప్రభుత్వ భూమి ఉంటే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి, ఆర్డీఓ వసంతబాబు, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద అధికారులు చేపట్టిన ‘యోగాంధ్ర’ రిజిస్ట్రేషన్ సర్వేను కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి డ్వామా పీడీ, జెడ్పీ సీఈఓ, డీపీఓ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సూర్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వంశీ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
28 పడకలతో కోవిడ్ వార్డు
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఈఎన్టీ వార్డులో 28 పడకలతో కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. మూడు వెంటిలేటర్లు, 50 వీటీఎం కిట్లను అందు బాటులో ఉంచారు. మంగళవారం ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈఎన్టీ వార్డులో 24 గంటలూ స్టాఫ్నర్సులు ఉండేలా, టెక్నీషియన్, వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని నోడల్ ఆఫీసర్ డాక్టర్ రామస్వామిని ఆదేశించారు.
రాయదుర్గం, గుమ్మఘట్టకు అత్యధిక అలాట్మెంట్
అనంతపురం అగ్రికల్చర్: రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రక్రియలో భాగంగా పంట విస్తీర్ణం బట్టి మండలాలకు విత్తన కేటాయింపులు చేశారు. ఈ ఏడాది జిల్లాకు కేవలం 50,592 క్వింటాళ్లు కేటాయించారు. అందులో కే–6 రకం 46,692 క్వింటాళ్లు, కదిరి–లేపాక్షి (కే–1812) రకం 900 క్వింటాళ్లు, టీసీజీఎస్–1694 రకం 3 వేల క్వింటాళ్ల పంపిణీకి అనుమతులు జారీ చేశారు. తాజాగా డివిజన్లు, మండలాల వారీగా విత్తన వేరుశనగ బస్తాలను అలాట్ చేశారు. రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాలకు అత్యధికంగా 3 వేల క్వింటాళ్ల చొప్పున కేటాయించగా... యల్లనూరు మండలానికి క్వింటా కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఇక పుట్లూరుకు 50 క్వింటాళ్లు, తాడిపత్రి మండలానికి 100 క్వింటాళ్లు ఇచ్చారు. మొత్తమ్మీద కళ్యాణదుర్గం సబ్డివిజన్ పరిధిలో ఉన్న ఆరు మండలాలకు అత్యధికంగా 14,462 క్వింటాళ్లు కేటాయించారు. ఆ తర్వాత అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో ఆరు మండలాలకు 10,500, రాయదుర్గం డివిజన్లో ఐదు మండలాలకు 10,200, ఉరవకొండ డివిజన్లో నాలుగు మండలాలకు 6,850, గుత్తి సబ్ డివిజన్లో ఐదు మండలాలకు 6,750 క్వింటాళ్లు అలాట్ చేశారు. అత్యల్పంగా తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో ఐదు మండలాలకు 1,830 క్వింటాళ్లు కేటాయించారు.
రాయితీ ఇలా..
కే–6, టీసీజీఎస్–1694 రకం క్వింటా పూర్తిధర రూ.9,300 కాగా 40 శాతం రాయితీ రూ.3720 పోనూ రైతుల వాటా కింద రూ.5,580 ఖరారు చేశారు. కే–1812 రకం ధర రూ.8,200 కాగా రాయితీ రూ.3,280 పోనూ రైతులు రూ.4,920 ప్రకారం చెల్లించాలి. ఒక్కో రైతుకు గరిష్టంగా 30 కిలోల బస్తాలు మూడు పంపిణీ చేయనున్నారు.

‘నవోదయ’ నిర్మాణానికి భూమిని గుర్తించండి