రాజధాని పేరుతో రియల్‌ వ్యాపారం | - | Sakshi
Sakshi News home page

రాజధాని పేరుతో రియల్‌ వ్యాపారం

Apr 28 2025 1:11 AM | Updated on Apr 28 2025 1:11 AM

రాజధాని పేరుతో రియల్‌ వ్యాపారం

రాజధాని పేరుతో రియల్‌ వ్యాపారం

అనంతపురం కార్పొరేషన్‌: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలవుతున్నా.. సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒక్కటీ అమలు చేయకపోగా, రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి సీఎం చంద్రబాబు తెరలేపారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనే రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఫలితంగా రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని అన్నారు. ఆదివారం ఆయన నగరంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రాజధానికి 58 వేల ఎకరాలు అందుబాటులో ఉండగా.. మళ్లీ 44 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికే సేకరించిన భూమిలో అభివృద్ధి చేయలేదని, రైతులకు ప్లాట్లు కేటాయించలేదని, మళ్లీ ల్యాండ్‌ పూలింగ్‌, భూసేకరణ అంటున్నారని మండిపడ్డారు. గతంలో రాజధాని పేరుతో ప్రధాని మోదీ మట్టి, నీరు తెచ్చారని, ఇప్పుడు పునర్నిర్మాణం అంటూ మరో డ్రామాకు తెరలేపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే రూ.1.47 లక్షల కోట్లు అప్పులు చేయడం సంపద సృష్టి అవుతుందా బాబూ అని ప్రశ్నించారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధిని ఏమాత్రమూ పట్టించుకోలేదన్నారు. కేంద్రం కుట్రతో పోలవరం ఎత్తును 45.75 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తే నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పోలవరం ఎత్తు కుదిస్తున్నా మారు మాట్లాడకుండా పోలవరం–బనకచెర్ల అనుసంధానం పేరుతో మరోసారి మోసం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ పర్యటనలో పోలవరం ఎత్తు పెంచేందుకు ఒత్తిడి తీసుకురావాలన్నారు. బాబు పాలనలో రూ.99లకు క్వార్టర్‌ బాటిల్‌, 99 పైసలకే ఎకరా భూమి ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రూ.కోట్లు విలువైన భూమిని 99 పైసలకే ఇవ్వొచ్చని నిరూపించిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని విమర్శించారు.

నోరా..? తాటిమట్టా?

సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూటమి సర్కారు ఒక ప్రణాళికతో ముందుకెళ్లే పరిస్థితి ఏమాత్రమూ కన్పించడం లేదన్నారు. పింఛన్లు ఇస్తున్నామని గొప్పగా చెబుతున్నారని, వాస్తవానికి 11 నెలల కాలంలోనే మూడు లక్షలకు పైగా పింఛన్లలో కోతపెట్టారని తెలిపారు. మెగా డీఎస్సీ పేరుతో తొలి సంతకం చేసిన చంద్రబాబు ఇప్పుడు 16 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చి నిరుద్యోగులను వంచించారన్నారు. ఇవి కూడా వచ్చే విద్యా సంవత్సరానికి భర్తీ చేసే పరిస్థితి కన్పించడం లేదన్నారు. తల్లికి వందనం పేరిట ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని ఇంత కాలం వెల్లదీశారన్నారు. ఇటీవల చంద్రబాబు తల్లికి వందనం ఒక విడతలో ఇవ్వాలా, ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నామని చెప్పడం చూస్తే ఆయనది నోరా లేక తాటిమట్టా అని భావించాల్సి వస్తోందని అనంత మండిపడ్డారు. ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా రైతులకు రూ.20 వేలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. రైతుల ఆత్మహత్యలు, వలసలను ప్రోత్సహించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు ఏనాడైనా రైతాంగాన్ని ఆదుకునేందుకు ఒక్క సమీక్ష అయినా చేశారా అని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస రెడ్డి, అధికార ప్రతినిధి చింతకుంట మధు, నాయకులు కేశవరెడ్డి, కార్పొరేటర్‌ టీవీ చంద్రమోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సూపర్‌ సిక్స్‌ హామీలను విస్మరించారు

పోలవరం ఎత్తుపై ప్రధాన మోదీని ఒప్పించాలి

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement