
ఇద్దరు దొంగల అరెస్ట్
బుచ్చెయ్యపేట: బుచ్చెయ్యపేట మండలంలో ఐయితంపూడి గ్రామంలో రెండు ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఐయితంపూడి గ్రామానికి చెందిన ముచ్చకర్ల బొర్రయ్య, పెదిరెడ్ల రాజు తమ ఇళ్లకు తాళాలు వేసి ఇతర గ్రామాలకు కూలీ పనులకు వలస వెళ్లగా.. గతంలో దొంగతనాలు జరిగాయన్నారు. బంగారం, వెండి వస్తువులు, నగదు పట్టుకుపోవడంతో అప్పట్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఇదే గ్రామానికి చెందిన ఐయితరెడ్డి శివకుమార్, ముచ్చకర్ల కృష్ణమూర్తి వ్యసనాలకు బానిసై తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. రెండు ఇళ్లల్లో జరిగిన దొంగతనాలు జరిగిన ప్రదేశాల్లో వేలిముద్రలు, వారి కదలికలు ఆధారంగా నిందితులను పట్టుకుని విచారణ చేయగా దొంగతనంకు పాల్పడినట్లు ఒప్పుకున్నారన్నారు. వారి వద్ద నుంచి మూడు తులాలు బంగారు ఆభరణాలు, 10 తులాలు వెండి వస్తువులు, రూ.15 వేలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను సోమవారం చోడవరం కోర్టులో హాజరు పరిచామన్నారు. చోరీ కేసులను ఛేదించిన అదనపు ఎస్ఐ భాస్కరరావు, హెడ్ కానిస్టేబుల్ అర్జున్, కానిస్టేబుళ్లు గణేష్, వెంకట్, హరీష్, కిరణ్, హోంగార్డులు నాగేష్, కనకరాజులను సీఐ కోటేశ్వరరావు అభినందించారు.