
పుష్పయాగానికి పూలు తరలింపు
ఎంవీపీ కాలనీ (విశాఖ): తిరుపతిలోని శ్రీ కొండండరామస్వామి వారి పుష్పయాగం కోసం విశాఖ నుంచి వివిధ రకాల పూలను తరలించారు. కార్తీక దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన ఈ పుష్పాలను శుక్రవారం ఉదయం ఎంవీపీ కాలనీలోని టీటీడీ ఈ–దర్శనం కౌంటర్ వద్ద భక్తుల సందర్శన కోసం ఉంచారు. మహిళా భక్తులు ముందుగా పూలను అందంగా తీర్చిదిద్ది ప్యాకింగ్ చేశారు. అనంతరం సంకల్పం చేసి, శాస్త్రోక్తంగా ఈ పూలను తిరుమలకు పంపించారు. కలువలు, తామరలతో పాటు పలు రకాల పూలు ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్త హిమాన్షు ప్రసాద్ తెలిపారు. నగరానికి చెందిన మహిళా భక్తులు పాల్గొన్నారు.