
● ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం నిల్వలు ● జూన్ 1 నుంచి
కైలాస్నగర్: వానాకాలం నేపథ్యంలో రేషన్ లబ్ధిదారులకు మూడు నెలల కోటా బియ్యం ఒకేసారి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్డుదారులకు సరిపడా కోటా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు అవసరమైన సన్నబియ్యం సరఫరా చేసేందుకు గాను నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలను కేటాయించింది. దీంతో ఆయా జిల్లాల నుంచి స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం చేరుకుంటుండగా రేషన్ షాపుల వారీగా సరఫరా ప్రారంభించారు. జూన్ 1నుంచి కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. సర్కారు నిర్ణయంపై కార్డుదారుల్లో హర్షం..డీలర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.
కార్డుదారులకు ఇబ్బందుల్లేకుండా...
వర్షాకాలంలో రోడ్ కనెక్టివిటీ లేనటువంటి గ్రామాల ప్రజలు రేషన్ బియ్యం పొందేందుకు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి సరఫరా చేసేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు అవసరమైన కోటా విడుదల చేయగా జిల్లాలోని ఐదు ఎంఎల్ఎస్ పాయింట్లకు సన్నబియ్యం చేరుతున్నాయి. వాటిని కేటాయింపుల ఆధారంగా రేషన్షాపులకు సరఫరా చేస్తున్నారు. కార్డుదారులు మూడు నెలల కోటా బియ్యం ఒకేసారి తీసుకోవాలంటే డీలర్ వద్ద గల పీఓఎస్ డివైస్పై మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎప్పటిలాగే ప్రతి నెలా తీసుకుంటామంటే అలా కూడా తీసుకునే వెసులుబాటు కల్పించింది. జూన్ 1 నుంచి 30వరకు డీలర్లు పంపిణీ చేయనున్నారు.
డీలర్ల ఆందోళన..
ప్రభుత్వ నిర్ణయాన్ని కార్డుదారులు స్వాగతిస్తుండగా డీలర్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలకు సరిపడా కోటా బియ్యం మాత్రమే నిల్వ చేసేలా రేషన్ షాపులు ఉండటంతో ఒకేసారి మూడు నెలల కోటా తీసుకుంటే దాన్ని ఎక్కడా నిల్వ చేయగలమని ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు కొన్ని షాపుల్లో మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిల్వల తరలింపుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంతో అవి అలాగే ఉండిపోయియి. తాజాగా పూర్తి స్థాయిలో బియ్యం తెచ్చుకుంటే భారీ వర్షాలకు బియ్యం తడిసి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని హైరానా పడుతున్నారు. అయితే ఈ విషయంలోనూ వారికి వెసులుబాటు కల్పించినట్లుగా పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. కార్డుదారులకు బియ్యం పంపిణీని ప్రారంభించి, ఖాళీ అయిన నిల్వల వారీగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. తద్వారా వారికి కొంత ఊరట కలిగనుంది.