అర్నాబ్‌ గోస్వామి దంపతులపై దాడి...

Republic TV Arnab Goswami And His Wife Were Attacked - Sakshi

ముంబై : రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామి దంపతులపై బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. ముంబైలోని స్టూడియో నుంచి ఆర్నాబ్‌ గోస్వామి, అతని భార్య ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వారిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. బైక్‌పై దూసుకొచ్చిన వ్యక్తులు అర్నాబ్‌ వాహనం దాడికి యత్నించారు. తనపై దాడికి సంబంధించి అర్నాబ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో అర్నాబ్‌ దంపతులకు ఎటువంటి గాయాలు కాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఈ ఘటనకు సంబంధించి ఆర్నాబ్‌ వీడియో సందేశాన్ని రిపబ్లిక్‌ టీవీ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో.. తనపై దాడికి పాల్పడింది కాంగ్రెస్‌ యూత్‌ నాయకులేనని అర్నాబ్‌ ఆరోపించారు. ఆఫీసు నుంచి తిరిగివస్తున్న తమపై రాత్రి 12.15 గంటలకు దాడి జరిగిందని చెప్పారు. బైక్‌ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు అద్దాలు పగలకొట్టడానికి యత్నించారని తెలిపారు.  తనకు ఏదైనా జరిగితే కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, తనపై జరిగిన దాడిని వ్యక్తిగతంగా ఎదుర్కొంటానని.. దీనిపై ఎంత దూరమైనా వెళ్తానని తెలిపారు. తాను, తన టీవీ చానెల్‌ నిజం కోసమే పనిచేస్తుందని అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top