‘అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లల్ని కోల్పోవడం చాలా బాధాకరం. అయినా అధైర్య పడొద్దు. ఉన్న ఒక్క పాప బంగారు భవిష్యత్తు కోసం వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందంటూ’ బాధితురాలు వాజిదా తబసూంకు ఆ పార్టీ అనంతపురం నియోజకవర్గం సమన్వయకర్త నదీం అహ్మద్ భరోసా ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ, ఎక్స్గ్రేషియా అందకపోవడంపై సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13న లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని బాధితురాలు వజిదా తబసూంకు ఆదివారం ఆమె నివాసంలో అందజేశారు. ఈ నెల 11న ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గం వడ్డిపల్లికి వచ్చారు. ఆ గ్రామంలో జరిగిన మైనారిటీల ఆత్మీయ సదస్సులో బాధితురాలు డెంగీతో తన ఇద్దరు చిన్నారులు మరణించారని, ప్రతిపక్ష నేత ముందు కన్నీటి పర్యంతమైన విషయం విదితమే.
సమన్వయకర్త నదీం అహ్మద్ మాట్లాడుతూ బాధిత కటుంబానికి అప్పటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు, సొంతిల్లు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించిన అంశాన్ని సీఎంకు పంపిన లేఖలో పేర్కొన్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలని అందులో కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వజిదా తబసూంకు ప్రతిపక్ష నేత ఇచ్చిన హామీను నెరవేరుస్తారన్న విషయాన్ని గుర్తు చేశారు. బాధితురాలు వజిదా తబసూం కన్నీటి పర్యంతమయ్యారు. జగనన్న తమ కుటుంబానికి అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. వారికి రుణపడి ఉంటానన్నారు. 8వ డివిజన్ కార్పొరేటర్ బోయ పక్కీరమ్మ, వైఎస్సార్ సీపీ నేతలు రామ, లక్ష్మణ్, పసుపుల బాలకృష్ణారెడ్డి, వాసగిరి నాయుడు, సాకే చంద్రశేఖర్, గోపీనాథ్యాదవ్, నూర్బాషా, సాకే రామకృష్ణ, మునీరా, ఓబుళపతి తదితరులు పాల్గొన్నారు.