శ్రీకాకుళం, సంతబొమ్మాళి: స్థానిక పంచాయతీ పరిధి జగన్నాథపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గుడి బడి అయ్యింది. తిత్లీ తుపాను ప్రభావం, పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియని స్థితిలో ఉంది. దసరా సెలవులు ముగియడంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల భవనం తుఫాన్ వల్ల కుంగిపోయి, శిథిలావస్థకు చేరుకోవడంతో ఆందోళన వ్యక్తంచేశారు.
చదువులు నేర్పిన పాఠశాలకు ఈ దుస్థితి రావడంతో దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామంలో ఉన్న కొత్తమ్మతల్లి ఆలయం విద్యార్థులకు బడిగా మారింది. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. దీనిపై స్పందించిన డీఈఓ ఎం.సాయిరాం స్థానిక పాఠశాలను మంగళవారం సందర్శించారు. పాఠశాల పరిస్థితిని చూసి అదనపు భవనాన్ని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గుడిలో చదువుతున్న విద్యార్థులు పలు ప్రశ్నలను అడిగి సమాధానం రాబట్టారు. పరిశీలనలో ఎంఈఓ చిన్నవాడు తదితరులు పాల్గొన్నారు.