
ఏపీ మంత్రులు వీరే?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో స్థానం కోసం టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ ముఖ్యులతో చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
ముమ్మర కసరత్తులో బాబు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో స్థానం కోసం టీడీ పీ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ ముఖ్యులతో చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పలు సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఆయన్ను కలిసి తమ వర్గానికి మంత్రివర్గంలో ఎక్కువ స్థానాలివ్వాలని కోరుతున్నారు. అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని వారికి బాబు చెబుతున్నారు. తొలి దశలో జిల్లాకు ఒక మంత్రితో సరిపుచ్చే అవకాశముంది. ఆశావహుల్లో అనంతపురం నుంచి పరిటాల సునీత , బీకే పార్థసారథి, కాలువ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి ఉన్నారు. వీరిలో సునీతకు పదవి ఖాయం. ఈ జిల్లా నుంచి మరో స్థానంలో బీసీలకు అవకాశం కల్పించాలనుకుంటే బీకే, కాలువ ల్లో ఒకరికి అవకాశం లభిస్తుంది. కర్నూలు నుంచి కేఈ కృష్ణమూర్తికి పదవి ఖాయమైంది.
మంత్రి పదవికి ఆయన అయిష్టత చూపితే ఉప ముఖ్యమంత్రి, లేదా స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కడప నుంచి ఎమ్మెల్సీ ఎస్వీ సతీశ్కుమార్రెడ్డికి అవకాశముంది. ఇక బాబు సొంత జిల్లా చిత్తూరు నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి చోటు ఖాయమైంది. వెంకటరమణ లేదా ఎస్సీ కోటాలో తలారి ఆదిత్యకు అవకాశం దక్కవచ్చు. నెల్లూరు నుంచి గెలిచిన వారంతా మంత్రి పదవి ఆశిస్తున్నారు. వారికి అవకాశమిస్తారో, లేదా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, బీద మస్తాన్రావు, బీద రవిచంద్ర యాదవ్, డాక్టర్ పి.నారాయణల్లో ఎవరికైనా మంత్రి పదవిచ్చి తరవాత వారిని ఎమ్మెల్సీలను చేస్తారా అనేది చూడాలి. ఇక ప్రకాశం జిల్లాలో సిద్ధా రాఘవరావుకు మంత్రి పదవి ఖాయమైంది. జిల్లా నుంచి యువత కోటాలో ఏలూరు సాంబశివరావుకు అవకాశం రావచ్చు. గుంటూరు జిల్లాలో కోడెల, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, నన్నపనేని రాజకుమారిలకు అవకాశాలున్నాయి. కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, కాగిత వెంకట్రావు పేర్లు ఖరారయ్యాయి. మండలి బుద్ధప్రసాద్ పేరూ పరిశీలనలో ఉంది. పశ్చిమ గోదావరి నుంచి చింతమనేని ప్రభాకర్, వీవీ శివరామరాజు, పీతల సుజాత పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
తూర్పు గోదావరి నుంచి యనమల రామకృష్ణుడుకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చు. జిల్లా నుంచి నిమ్మకాయల చినరాజప్పతో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తిల్లో ఇద్దరికి అవకాశం లభిస్తుంది. విజయనగరం జిల్లాలో పతివాడ నారాయణ స్వామి, కోళ్ల లలితకుమారి, కిమిడి మృణాళిని, శ్రీకాకుళంలో కె.అచ్చన్నాయుడు, కిమిడి కళా వెంకట్రావు, గౌతు శ్యామసుందర శివాజీల్లో ఒకరికి స్థానం లభిస్తుంది. శాసనసభాపతి కేఈ, కిమిడి, పతివాడ పేర్లను పరిశీలిస్తున్నట్టు టీడీపీ వర్గాల సమాచారం.