
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి
ఏలూరు (టూటౌన్): పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్సీ సర్పంచ్లు హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ అన్నారు. పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని స్థానిక ఎన్ఆర్పేటలోని ఎస్సీఆర్పీఎస్ అండ్ ఏఐఏవైఎస్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అత్యంత కీలకమైనదని, మేధావులతో కూడిన అనేక కమిటీలు దీన్ని ఏర్పరిచారన్నారు. కానీ పంచాయతీరాజ్ చట్టాలను అమలు చేయటంలో గ్రామ స్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు విఫలమయ్యారని చరిత్ర తెలియజేస్తుందన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సర్పంచ్, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు పాలనను వారిని చేయనియ్యకుండా ఎమ్మెల్యేలు హైజాక్ చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నూకపెయ్యి కార్తీక్ పాల్గొన్నారు.
హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్
ఏలూరు టౌన్: హత్యాయత్నం కేసులో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు కత్తేపువీధికి చెందిన షేక్బాజీ గతంలో బావిశెట్టివారిపేటకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇరువరి మధ్య వివాదం తలెత్తడంతో ఆమెను వదిలివేశాడు. అయితే అత్త జయలక్ష్మిపై బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈనెల 22న రాత్రివేళ జయలక్ష్మిపై బిర్లాభవన్ సెంటర్ వద్ద షేక్బాజీ ఆకస్మికంగా వెనుకవైపు నుంచి దాడి చేశాడు. తీవ్ర గాయాలైన జయలక్ష్మిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏలూరు వన్టౌన్ పోలీసులు షేక్బాజీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అతడ్ని గురువారం సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది.
నారాయణపురంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ
ఉంగుటూరు: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులకు నారాయణపురం శ్రీ అరవింద శతజయంతి ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ టి కే విశ్వేశ్వరరావు తెలిపారు. ఈనెల 26వ తేదీలోగా విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 81251 55788 నంబర్లో సంప్రదించాలని కోరారు.