
పంటల సాగుపై రైతులకు అవగాహన
వనపర్తి రూరల్: మండలంలోని కడుకుంట్ల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్లో భాగంగా ఐఐఓఆర్ ప్రధాన శాస్త్రవేత్తలు డా. ఆర్డీ ప్రసాద్ వానాకాలం పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆముదం, వేరుశనగ సాగులో మెళకువలు, సాంకేతికత గురించి వివరించారు. కేవీకే మదనాపురం శాస్త్రవేత్త భవాని మాట్లాడుతూ.. వానాకాలంలో వరి, కంది సాగుకు అనుకూలమైనవని, రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కిసాన్ డ్రోన్లు, బయో ఎరువుల గురించి వివరించారు. ఏఈఓ కవిత మాట్లాడుతూ.. భూమి సారవంతంగా ఉండాలంటే రైతులు పచ్చిరొట్ట పైర్లు 40 రోజులు ముందుగా వేసుకొని పూత దశలో కలియదున్నాలని, దీంతో భూసారం దెబ్బ తినకుండా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వరి కొయ్యలను తగలబెట్టరాదని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోవర్ధన్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
నర్సింగాపురంలో..
మదనాపురం: మండలంలోని నర్సింగాపురంలో ప్రధాన పంటలైన వరి, పత్తి, వేరుశనగ, జీలుగ, కంది పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్త అనిత సంతులిత, సేంద్రియ ఎరువుల వినియోగం, భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు. విత్తన ఎంపికపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఓ గాయత్రి, మాజీ సర్పంచ్ హనుమాన్రావు, మైనుద్దీన్, కాశన్న, గట్టన్న తదితరులు పాల్గొన్నారు.