
వరంగల్ సభను విజయవంతం చేద్దాం
గోపాల్పేట: వరంగల్లో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఏదుల, రేవల్లిలో పార్టీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఏదులలో సమావేశంలో మాట్లాడుతూ.. గుత్తేదారుల కోసం కాంగ్రెస్ నాయకులు రూ.1,800 కోట్లతో ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండకు నీరు తరలించేందుకు యత్నిస్తున్నారని.. వారికోసమే రైతులను నష్టపరుస్తూ గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల అనుసంధానంతో కరువును పారద్రోలామని తెలిపారు. అనంతరం రేవల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రజతోత్సవ సభతో బీఆర్ఎస్ పార్టీకి మంచిరోజులు రాబోతున్నాయని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మెజార్టీ సాధించనుందని చెప్పారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.