
234 వచ్చినా ఆశ్చర్యం లేదు!
సాక్షి, చైన్నె : వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ‘200 కాదు..220 కాదు..234’స్థానాలు డీఎంకే కూటమి గెలుచుకున్నా ఆశ్చర్యం లేదని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆ మేరకు ప్రజలతో మమేకమై శ్రమిస్తున్నామన్నారు. నేడు, ఇతర రాష్ట్రాలకే కాదు, భారతదేశానికే, ఇంకా చెప్పాలంటే ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగల గొప్ప ప్రభుత్వం అవశ్యమన్నారు.
బుధవారం చైన్నె మైలాపూర్ ఎమ్మెల్యే వేలు ఇంటి శుభ కార్యక్రమానికి హాజరైన సీఎం స్టాలిన్ కేడర్ను ఉద్దేశించి సభలో ప్రసంగించారు. వధువరులను ఆశీర్వదించినానంతరం వేలు సేవలను కొనియాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్నామని వివరించారు. వాగ్దానాలన్నీ కచ్చితంగా నెరవేరినట్టు ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కొంత మంది మాట్లాడుతూ చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నటు పేర్కొంటూ, 2026 లో 200 కాదు, 220 అవుతుందని వివరించారు. ఇందులో తప్పేమీ లేదని డీఎంకే కూటమి 234 స్థానాలు గెలుచుకున్నా (క్లీన్ స్వీప్) ఆశ్వర్యం లేదన్నారు. తాను ప్రతి జిల్లాకు వెళ్లినప్పుడు 5 కి.మీ దూరం నడుస్తున్నానని, ఈ సమయంలో జనం తన మీద చూపుతున్న ఆదరాభిమానుల చూస్తుంటే, ఎంతటి వారినైనా ఎదురించి నిలబడ గలమన్న ధీమా రెట్టింపు అవుతోందన్నారు. ఎందరు ... ఎలాంటి కూటమి వచ్చినా సరే, తన కర్తవ్యాన్ని నిర్వరిస్తానని పేర్కొన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. సీబీఐ, ఈడీ వచ్చినా తగ్గేది లేదని ధీమా వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా 1975 పరిస్థితులను గుర్తు చేస్తూ ఆ సమయంలో కలైంజ్ఞర్ కరుణానిధి పాలనా వ్యూహాలను వివరించారు. ప్రభుత్వం కాదు. తమ ప్రాణాలు పోయినా సరే నియంతృత్వానికి మద్దతు ఇవ్వం, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షిస్తాం అని అప్పట్లో కలైంజ్ఞర్ స్పష్టం చేశారని పేర్కొన్నారు.
ఆ మేరకు శ్రమిస్తున్నాం..
సీఎం స్టాలిన్
7వసారి
వస్తామ్మన్న
నమ్మకం
ఉంది
కలైంజ్ఞర్ సారధ్యంలో ఐదు సార్లు అధికారంలోకి ఈ రాష్ట్రంలో వచ్చామని, అరవ సారి ప్రస్తుతం అధికారంలో ఉన్నామని, ఏడో సారి అధికారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అధికారం కొనసాగుతుందన్న ఆశ, నమ్మకం తనలో ఉందన్నారు. నెల రోజులకుపైగా జరిగిన అసెంబ్లీ సమావేశాలను గుర్తుచేస్తూ, ఇందులో చేసిన ప్రకటనలు, ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి తీరును వివరించారు. తమకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వ లేక ఏదో ఒక రకంగా బురద చల్లేందుకు అసెంబ్లీని కూడా వేదికగా చేసుకున్నారని విమర్శించారు. ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో అన్నది అందరికి తెలిసిన విషయంగా పేర్కొంటూ చమత్కారాలతో కూడిన వ్యంగ్యాస్త్రాలను సందించారు. అసెంబ్లీ వేదికగా 110 నిబంధలకు అనుగుణంగా ప్రకటించిన కొత్త అంశాలన్నీ అమలులోకి రానున్నట్టు వివరించారు. అనంతరం వధూవరులను, ఎమ్మెల్యే వేలును ప్రశ్నిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దయ చేసి పుట్టే పిల్లలకు తమిళం పేర్లుపెట్టాలని, ఇదే తన అభ్యర్థన అని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, సీపీఎం నేత షణ్ముగం, డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అందియూరు సెల్వరాజ్, మంత్రులు అనితారాధాకృష్ణన్, రాజకన్నప్పన్, అన్బిల్ మహేశ్ పోయ్యామొళి, కయల్వెలి సెల్వరాజ్ , ఎంపీలు తమిళచ్చి తంగపాండియన్, డాక్టర్ వీరాస్వామి, ద్రవిడ ఉద్యమ తమిళ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు.