
రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య
● కుమార్తె బాల్య వివాహంపై పోలీసులు కేసు నమోదు చేయడమే కారణమా?
వేలూరు: క్రిష్ణగిరి జిల్లా బర్గూర్ సమీపంలోని జగదేవి గ్రామానికి చెందిన కుమార్(50) ఇతని భార్య కవిత(45). దంపతుల 17 సంవత్సరాల కుమార్తె అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోంది. దీంతో ఇరు కుటుంబ సభ్యులు చర్చించి వారికి వివాహం చేశారు. వివాహం చేసుకున్న యువతి వేరే కులానికి చెందిన వారు కావడంతో ఈ పెళ్లిని పలువురు వ్యతిరేకించినట్లు తెలిసింది. దీంతో బాల్య వివాహం చేసినట్లు బర్గూరు పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో మనో వేదనతో ఉన్న చిన్నారి పురుగుల మందు తాగి ప్రస్తుతం క్రిష్ణగిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బాల్య వివాహం చేయడంతో బర్గూరు పోలీసులు చిన్నారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు మనో వేదనతో ఉన్నారు. కేసు నమోదు చేయడంతో ముందస్తు జామీను తీసుకునేందుకు చైన్నె హైకోర్టుకు వెళ్తున్నట్లు కుమార్, భార్య కవిత తిరుపత్తూరుకు బయలుదేరి వచ్చారు. అనంతరం మేలకారన్పట్టి గ్రామంలోని రైల్వే పట్టాల వద్దకు చేరుకొని ౖరైలు వచ్చే సమయంలో రైలు పట్టాలపై నిలిచి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రైలు ఢీకొనడంతో దంపతుల ఇద్దరి మృతదేహాలు చెల్లా చెదరుగా పడింది. విషయం తెలుసుకున్న జోలార్పేట రైల్వే పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు జోలార్పేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య