
కూలి చెల్లించాలని బస్సు అడ్డగింత
వేలూరు: ఉపాధి కూలీలకు 20 నెలలుగా కూలి చెల్లించక పోవడాన్ని ఖండిస్తూ మహిళా కూలీలు ప్రభుత్వ బస్సును అడ్డగించి ధర్నా నిర్వహించారు. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని తిరుమని గ్రామంలో వందకు పైగా మహిళా కూలీలు ఉపాధి పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఇటీవల కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించలేదని తెలిసింది. దీంతో దేశ వ్యాప్తంగా కూలీలు పనులు చేయకుండా ప్రస్తుతం నిలిపి వేశారు. ఇదిలా ఉండగా తిరుమని గ్రామంలో వందకు పైగా కూలీలు చేసిన పనులకు 20 మాసాలుగా కూలి చెల్లించకపోవడంతో ప్రస్తుతం పనులను నిలిపి వేశారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం ఉదయం గ్రామానికి వచ్చిన ప్రభుత్వ బస్సును అడ్డగించి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న లత్తేరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహిళలతో చర్చలు జరిపారు. ఆ సమయంలో పోలీసులు మహిళలను తోసివేసినట్లు తెలుస్తుంది. దీంతో మహిళా కూలీలపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ మహిళలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో మహిళలతో పాటు రాస్తారోకోలో ఉన్న ఇద్దరు పురుషులను పోలీసు వ్యాన్ ఎక్కించడంతో మహిళలు పోలీసుల వ్యాన్ను అడ్డుకొని మరోసారి రాస్తారోకో చేశారు. పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింపజేశారు.