
మౌలిక సదుపాయాలను కల్పించాలి
తిరువళ్లూరు: ఎగువనల్లాటూరు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఉపాధి హామీ పనులను కేటాయించాలని కోరుతూ పెద్ద ఎత్తున మహిళలు బుధవారం కడంబత్తూరు బీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు. తిరువళ్లూరు జిల్లాలోని ఎగువనల్లాటూరు గ్రామంలో రెండువేలకు పైగా నివాసాలు వున్నాయి. గ్రామంలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత గ్రామాన్ని ఇటీవలే తిరువళ్లూరు మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో మూడు నెలల నుంచి ఉపాధీ పనులు నిలిపివేశారు. మూడు నెలల కూలి సైతం మహిళలకు చెల్లించలేదు. ఇదే విషయాన్ని మహిళలు పలుమార్లు ఉన్నతాధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో బుధవారం కడంబత్తూరు బీడీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకురాలు పూంగోదై, జిల్లా కన్వీనర్ గోపాల్ హాజరై ప్రసంగించారు. ఎగువ నల్లాటూరు గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయకూడదని, బకాయి కూలిని వెంటనే విడుదల చేయాలని, గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. గంట పాటు ఆందోళన సాగిన క్రమంలో బీడీఓ సెల్వి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. వారం రోజుల్లో సమస్యలను పరిస్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు.