
బాలుడి ఆచూకీ కోసం..
కావలి: పట్టణంలోని అరుంధతిపాళెం ప్రాంతానికి చెందిన గౌడుపేరు మహేష్ (14) ఈనెల 11వ తేదీ నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు చిన్నయ్య, శిరీష తెలిపారు. పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్లో సోమవారం వారు వివరాలు వెల్లడించారు. మహేష్ కావలిలోని కాకతీయ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. 11వ తేదీ సాయంత్రం ఏడు గంటల నుంచి కనిపించడం లేదు. కుటుంబసభ్యులు గాలించారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఆచూకీ తెలిస్తే 82206 61333, 63053 85671 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
పొట్టకూటి కోసం వెళ్లి..
● కువైట్లో కమ్మవారిపల్లి వాసి
ఆత్మహత్య
సోమశిల: పొట్టకూటి కోసం వేరే దేశానికి వెళ్లిన మండలంలోని కమ్మవారిపల్లికి చెందిన రేణింగి వెంకటేశ్వర్లు (46) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు సోమవారం వివరాలు వెల్లడించారు. వెంకటేశ్వర్లుకు భార్య సుమతి, ఒక కుమార్తె ఉన్నారు. అతను వ్యవసాయ పనులు చేసేవాడు. అయితే ఆర్థిక సమస్యలు తలెత్తాయి. కువైట్లో అప్పటికే బంధువులు ఉండడంతో వారి ద్వారా అక్కడికి వెళ్లాడు. చిన్నాచితకా పనులు చేసేవాడు. అయితే జీతాలు ఇవ్వకపోవడంతో మానసికవేదనకు గురయ్యాడు. కుటుంబ అవసరాలకు కూడా డబ్బు పంపలేని పరిస్థితి రావడంతో తాను ఉంటున్న గదిలోనే ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్వగ్రామం కమ్మవారిపల్లికి సోమవారం తీసుకురాగా అంత్యక్రియలు చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వీడియో, రీల్స్ పోటీలు
● ప్రముఖ ఆలయాల ఔన్నత్యం
తెలిపేలా చిత్రీకరణ
● ఈ నెల 22లోగా ఆన్లైన్లో పంపాలి
● జిల్లా పర్యాటకాభివృద్ధి అధికారి
శ్రీనివాసరావు
నెల్లూరు(దర్గామిట్ట): ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో జిల్లాలోని చారిత్రాత్మక ప్రదేశాలు, సముద్రతీర ప్రాంతాలు, ప్రముఖ ఆలయాల ఔన్నత్యం తెలిపేలా వీడియో, రీల్స్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు ఒక నిమిషం నిడివి వీడియోలు లేదా 15 నుంచి 30 సెకన్ల నిడివి రీల్స్ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న ప్రకృతి ప్రేమికులు జిల్లాలో ప్రసిద్ధ దర్శనీయ ప్రదేశాలైన ఉదయగిరి దుర్గం, మైపాడు బీచ్, ఇసుకపల్లి బీచ్, లైట్హౌస్, రామాయపట్నం బీచ్, లైట్హౌస్, జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి అమ్మవారి ఆలయం, నరసింహకొండలోని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పెంచలకోనలోని పెనుశిల నరసింహస్వామి ఆలయం, నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, కండలేరు, సోమశిల రిజర్వాయర్లు తదితర పర్యాటక ప్రదేశాలు కవరయ్యేలా వీడియో, రీల్స్ను చిత్రీకరించి క్యూఆర్ కోడ్ ద్వారా ఈ నెల 22వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా పంపాలని కోరారు. అత్యుత్తమ వీడియో, రీల్స్ చిత్రీకరించిన విజేతలకు మొదటి బహుమతి కింద రూ.15 వేలు, 2వ బహుమతి రూ.10 వేలు, మూడో బహుమతి రూ.5 వేలు, ఐదుగురికి రూ.వెయ్యి చొప్పున కన్సోలేషన్ బహుమతులు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి మొబైల్ నంబర్ 98480 07024ను సంప్రదించాలని సూచించారు.
కండలేరులో
13.683 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 13.683 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్రెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 8,000 క్యూసెక్కుల నీరు చేరుతోందని వెల్లడించారు. అదేవిధంగా కండలేరు నుంచి సత్యసాయిగంగ కాలువకు 170, లోలెవల్ కాలువకు 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

బాలుడి ఆచూకీ కోసం..