సిటీలోనే ‘సైబర్‌ హెల్పర్స్‌’! | - | Sakshi
Sakshi News home page

సిటీలోనే ‘సైబర్‌ హెల్పర్స్‌’!

May 26 2025 7:32 AM | Updated on May 26 2025 7:32 AM

సిటీలోనే ‘సైబర్‌ హెల్పర్స్‌’!

సిటీలోనే ‘సైబర్‌ హెల్పర్స్‌’!

సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరాది కేంద్రంగా సైబర్‌ నేరాలు చేసే సూత్రధారులకు సహాయం చేసే పాత్రధారులు సిటీలోనూ ఉన్నారు. బోగస్‌ వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి ఇవ్వడం ద్వారా సహకరిస్తూ కమీషన్లు తీసుకుంటున్నారు. రూ.8.75 లక్షలతో ముడిపడి ఉన్న ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్కామ్‌’ దర్యాప్తులో ఈ విషయం గుర్తించిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరు అనేక బ్యాంకు ఖాతాలను తెరిచి, వాటి వివరాలను సూత్రధారులకు పంపినట్లు గుర్తించామని డీసీపీ దార కవిత ఆదివారం ప్రకటించారు. నగరానికి చెందిన ఓ మహిళకు ఈ ఏడాది జనవరి 2న టెలిగ్రాం యాప్‌ ద్వారా ఓ సందేశం వచ్చింది. అక్కర్‌ అడ్వాంటేజ్‌ ప్లస్‌ మార్కెటింగ్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ మానవ వనరుల విభాగం నుంచి వచ్చినట్లు అందులో ఉంది. ఈ పేరుతో ఓ నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించిన నేరగాళ్లు దాని యూఆర్‌ఎల్‌ను బాధితురాలికి పంపారు. తమ సంస్థ తరఫున వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో పని చేయాలని కోరారు. ఏ ఇబ్బంది ఉండని ఈ ఉద్యోగం ద్వారా రోజుకు రూ.17 వేల నుంచి రూ.18 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉందని నమ్మించారు. ఆమె అంగీకరించడంతో ఆన్‌లైన్‌ హోటల్‌ బుకింగ్‌కు సంబంధించిన ఓ టాస్క్‌ ఇచ్చారు. ఇది పూర్తయిన తర్వాత అసలు కథ మొదలెట్టిన నేరగాళ్లు తమ వద్ద కొన్ని స్కీములు ఉన్నాయని, వాటిలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. తొలుత ఆమెతో రూ.10 వేలు పెట్టుబడి పెట్టించి, మరుసటి రోజే రూ.వెయ్యి లాభం పంచారు. ఆపై రూ.17,800, రూ.45,300 చొప్పున ఇన్వెస్ట్‌ చేయించారు. యానివర్సరీ స్పెషల్‌ ఆఫర్‌గా ‘గోల్డ్‌ సూట్‌ బుకింగ్‌’ విధానం ప్రవేశపెట్టామని, రూ.7.19 లక్షలు పెట్టుబడి పెడితే రూ.15.82 లక్షలు లాభం వస్తుందని చెప్పారు. ఆ మొత్తం పెట్టుబడిగా పెట్టాక నగదు తిరిగి ఇవ్వడానికి సెక్యూరిటీ డిపాజిట్‌ అంటూ మరికొంత మొత్తం బదిలీ చేయించుకున్నారు. ఇలా మొత్తం రూ.8,75,148 పెట్టుబడి పెట్టించిన కేటుగాళ్లు ఆమెను మోసం చేశారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదుతో సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఏసీపీ ఆర్‌జీ శివమారుతి నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ ఎం.సీతారాములు తమ బృందంతో ఈ కేసు దర్యాప్తు చేశారు. బాధితురాలు నగదు డిపాజిట్‌ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఈ మొత్తంలో కొంత నగరానికి చెందిన కొన్ని సంస్థల పేర్లతో తయారు చేసిన ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వీటిని ఓపెన్‌ చేసిన నగరవాసులు మనోజ్‌ దివాకర్‌, నాగిరి విజయ్‌, సనపర్తి కిషోర్‌ బాబు, రంగారెడ్డి జిల్లాకు చెందిన టి.సంతోష్‌కుమార్‌లను అరెస్టు చేశారు. వీళ్లు సైతం టెలిగ్రాం యాప్‌ ద్వారానే ఆకర్షితులపై ప్రధాన సూత్రధారులతో జట్టుకట్టినట్లు వెలుగులోకి వచ్చింది. తాము ఓపెన్‌ చేసిన ఖాతాలకు సంబఽంధించిన వివరాలను వారికి పంపినట్లు అంగీకరించారు. ఈ నలుగురినీ అరెస్టు చేసిన పోలీసులు సూత్రధారుల కోసం గాలిస్తున్నారు.

మ్యూల్స్‌ ఖాతాలు తెరిచి సూత్రధారులకు సహాయం

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్కామ్‌ దర్యాప్తులో వెలుగులోకి

నలుగురిని అరెస్టు చేసిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement