● వైభవంగా ఆదిదేవుని కల్యాణోత్సవం ● పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన అధికారులు ● లక్ష మందికిపైగా హాజరు ● రేపు రథోత్సవం
వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధిలో పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం ఉదయం 10.50 గంటలకు ఆలయ చైర్మన్ చాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై వేదమూర్తుల మంత్రోచ్ఛరణల మధ్య, భాజాభజంత్రీలతో కల్యాణం వైభవంగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సాయంత్రం పెద్దసేవపై ఊరేగించారు. దాదాపు లక్ష మంది వరకు హాజరయ్యారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, పట్టణంలోని ప్రముఖులు పాల్గొన్నారు. కన్యాదాతలుగా అప్పాల భీమాశంకరశర్మ–ఇందిర దంపతులు, వ్యాఖ్యాతగా చంద్రగిరి శరత్ వ్యవహరించారు. భక్తుల ద్వారా రూ.78 వేల కట్నాలు వచ్చినట్లు అకౌంట్స్ అధికారులు తెలిపారు. ఈనెల 30న రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.