
త్వరలో పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభిస్తాం
రెంటచింతల: పిడుగురాళ్ల వైద్య కళాశాలను రానున్న విద్యాసంవత్సరంలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి సత్యకుమార్ వ వెల్లడించారు. గురువారం రాత్రి మండల కేంద్రమైన రెంటచింతలలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో 3100 ఆరోగ్య ఉపకేంద్రాలను గత వైసీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులు మళ్లించి అసంపూర్తిగా నిర్మించారన్నారు. కేంద్రం నిధులతో కూటమి ప్రభుత్వం మరో 1700 ఆరోగ్య ఉపకేంద్రాలను గ్రామాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు బిఎస్సీ నర్సింగ్ చదివిన విద్యార్థులను వినియోగించుకుంటామన్నారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వం కూడా నిధులను కేటాయించడం జరిగిందన్నారు. మాచర్ల పట్టణంలో త్వరలోనే 100 పడకల వైద్యశాలను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆరోగ్య కేంద్రాలలో వైద్యుల కొరతను నివారించేందుకు పీపీపీ పద్ధతిలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ముందుగా పార్టీ యువ నాయకులు ఇగుటూరి రాజశేఖర్రెడ్డి దంపతులు మంత్రి సత్యకుమార్కు కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందచేసి దుశ్శాలవతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్, పల్నాడు జిల్లా ఇన్చార్జి కె.శ్రీనివాస్, మాచర్ల నియోజక వర్గ ఇన్చార్జి గుమ్మడి నాసరయ్య, మండల అధ్యక్షులు బోయిన నాగిరెడ్డి, పార్టీ నాయకులు పాశం మట్టారెడ్డి, ఇగుటూరి రాజశేఖర్రెడ్డి, సూరపరెడ్డి పుల్లారెడ్డి, విజయ్ కుమార్,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సత్యకుమార్