‘ఉపాధి’ రూ.300 అందేలా చర్యలు | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ రూ.300 అందేలా చర్యలు

Apr 27 2025 1:53 AM | Updated on Apr 27 2025 1:53 AM

‘ఉపాధి’ రూ.300 అందేలా చర్యలు

‘ఉపాధి’ రూ.300 అందేలా చర్యలు

జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు

నరసరావుపేట: జిల్లాలో ఉపాధి హామీ శ్రామికుల సగటు వేతనం రోజుకు రూ.300పైనే ఉండేలా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఉపాధిహామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రోజుకు 90వేల శ్రామికులకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా నిర్దేశించగా సగటున 50 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఏపీఎంలు ఉపాధి కల్పనలో రోజువారీ లక్ష్యాలను చేరుకునేలా కృషిచేయాలన్నారు. జిల్లాకు మంజూరైన 6500 ఫారం పాండ్లకు గానూ 2,200 ఫారం పాండ్ల నిర్మాణానికి అనుమతులు పొందాల్సిఉందన్నారు. డీఆర్‌ఓ మురళి, డీఎఫ్‌ఓ కృష్ణప్రియ, డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

ప్రధాని సభకు 600 బస్సులు

అమరావతి రాజధాని పునఃనిర్మాణ కార్యక్రమంలో పాల్గొనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు జిల్లా నుంచి 600 బస్సుల్లో ప్రజలను చేరవేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి జిల్లా, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సూచనలు, సలహాలు అందజేశారు. మరో 100 బస్సులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అవసరమైన మంచినీరు, అల్పాహారం, భోజనం వసతులు ఏర్పాటు చేయాలన్నారు. సభాస్థలి వద్ద పంచాయతీరాజ్‌శాఖ సిబ్బందిని ఏర్పాటుచేసి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వీటన్నిటికీ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ గనోరే నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారన్నారు.. దీనికి సంబంధించి రూట్‌ మ్యాప్‌ ఆర్‌అండ్‌బీ శాఖ ఈఈ రాజా నాయక్‌ నిర్వహిస్తారన్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

జీవిత భాగస్వామి పింఛన్‌ దరఖాస్తులు ఆమోదించండి

నరసరావుపేట: జీవిత భాగస్వామి పింఛను బదిలీ కోసం అందిన 3900 దరఖాస్తులను శనివారంతో ఆమోదించాలని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పింఛను పంపిణీ ఫీడ్‌ బ్యాక్‌ సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పంపిణీపై నేరుగా లబ్ధిదారుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడం జరుగుతోందన్నారు. లబ్ధిదారులతో ప్రవర్తించే విధానం, పంపిణీలో అక్రమాలు, ఇంటి వద్దే పంపిణీ వంటి అంశాలపై ఫీడ్‌ బ్యాక్‌ స్వీకరిస్తున్నామన్నారు. పదే పదే నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ అందిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి, గ్రామ వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి వెంకటరెడ్డి, డీఎల్డీఓ గబ్రు నాయక్‌, రాజగోపాల్‌ పాల్గొన్నారు.

పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్లాలి

నరసరావుపేట: కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న పాకిస్తాన్‌ దేశీయులు ఈనెలాఖరు కల్లా దేశాన్ని వీడి వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పరిధిలో ఉన్న పాకిస్తాన్‌ వాసులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్‌ అధికారులను ఆదేశించారు. వారి వీసాలను రద్దు చేసినందున సాధారణ వీసాలపై వచ్చిన వారు ఆదివారం నాటికి, వైద్య వీసాలపై వచ్చినవారు మంగళవారం కల్లా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేశారు. ఈ నెల 30 తర్వాత అట్టారీ సరిహద్దును మూసివేస్తున్న దృష్ట్యా జిల్లాలో పాకిస్తాన్‌ వీసాపై వచ్చిన వారిని గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement