
జీవితానికి యోగా తోడైతే అంతా ఆనందమే
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జీవితానికి యోగా తోడైతే అంతా ఆనందమయమేనని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. గురువారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆయుష్ శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. విద్యార్థులు, పరిశ్రమల ప్రతినిధులు, యోగా ఔత్సాహికులు తదితరులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శరీరంలో కొత్త ఉత్సాహాన్ని నింపే యోగాసనాలను ప్రతిఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహించేందుకు యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యానికి యోగాసనాల అభ్యసన ఎంత ముఖ్యమో పర్యవరణానికి మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి సంస్థలో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటుదామన్నారు.
హరిత విస్తీర్ణం పెంచుదాం..
ప్రజలు, అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో పెద్దఎత్తున మొక్కలు నాటి హరిత విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర@2047 లక్ష్యాల సాధనకు బాటలు వేస్తాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఈఈ పి.శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, వన్ ఎర్త్–వన్ లైఫ్ ప్రతినిధులు ఏలూరి లీలా కుమారి, ఆయుష్ అధికారులు, రామ్కో, కేసీపీ, అల్ట్రాటెక్, బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్, ఐడీఏ కొండపల్లి, ఐడీఏ జగ్గయ్యపేట ప్రతినిధులు, నర్సింగ్ విద్యార్థినులు తదితరులు హాజరయ్యారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ