
పోలీసు బదిలీలకు పారదర్శకంగా కౌన్సెలింగ్
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు సాధారణ బదిలీలలో బాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కమిషనర్ కార్యాలయంలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేశారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారితో స్వయంగా మాట్లాడి వారి వారి అభ్యర్థనల మేరకు వివిధ పోలీసు స్టేషన్లకు బదిలీ చేశామన్నారు. 14 మంది ఏఎస్ఐలకు, 118 మంది హెడ్ కానిస్టేబుళ్లకు, 188 మంది కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించి వివిధ పోలీసుస్టేషన్లకు బదిలీ చేసినట్లు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా సిబ్బందితో స్వయంగా మాట్లాడి వారి అభ్యర్థనల మేరకు బదిలీ చేశామని చెప్పారు. అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, ఏడీసీపీ ఎం.రాజారావు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్
రాజశేఖరబాబు