
రాజధాని నిర్మాణం గర్వకారణం
● మే 2న ప్రధాని మోదీతో పునఃనిర్మాణ పనులు ప్రారంభం ● అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రులు, శాసనసభ్యులు
చిలకలపూడి(మచిలీపట్నం): రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణంగా మిగలనుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో సోమవారం మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, వంగలపూడి అనిత, జిల్లాకు చెందిన శాసనసభ్యులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మే2న ప్రధాని మోదీ రాక సందర్భంగా సభా ప్రాంగణం సమీపంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కృష్ణాజిల్లా నుంచి లక్ష మందికి పైగా ప్రజలు తరలివెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ సభకు వచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యంతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ జి.గంగాధరరావు, శాసనసభ్యులు బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, వర్ల కుమార్రాజా, కాగిత కృష్ణప్రసాద్, మారిటోరియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాజీ మంత్రి పీతల సుజాత, అధికారులు పాల్గొన్నారు.