గరిడేపల్లి: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ ఈట సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపురం గ్రామానికి చెందిన జాల శ్రీరాములు(48) రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య జాల జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
వరి కొయ్యలను
కాల్చేందుకు వెళ్లి..
● మంటలంటుకొని రైతు మృతి
మాడుగులపల్లి: వరి కొయ్యలను తగులబెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని రైతు మృతి చెందాడు. మాడుగులపల్లి మండలం చెరువుపల్లి గ్రామంలో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువుపల్లి గ్రామానికి చెందిన బొల్లం లింగయ్య(70) ఉదయం తన పొలంలో వరి కొయ్యలను తగులబెట్టేందుకు వెళ్లాడు. కొయ్యలకు నిప్పంటించగా దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక పడిపోవడంతో మంటలంటుకొని కాలిన గాయాలతో పొలంలోనే మృతి చెందాడు. మధ్యాహ్నం స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ ఘటనకు సంబంధించిన తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
ఆదర్శ పాఠశాల తనిఖీ
గరిడేపల్లి: మండలంలోని గడ్డిపల్లి ఆదర్శ పాఠశాలను తెలంగాణ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్ఏ) జాయింట్ డైరెక్టర్ ఉషారాణి సోమవారం తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై ఉపాధ్యాయులను, అభ్యసన ఫలితాలపై ప్రత్యక్షంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఇటీవల జరిగిన ఘటనలపై ఆమె ఆరా తీసినట్లు సమాచారం. ఆమె వెంట అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవీణ్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ సాయిఈశ్వరి, మండల విద్యాధికారి చత్రునాయక్ ఉన్నారు.