పాముకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

పాముకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి

Published Thu, Mar 28 2024 1:40 AM

ఉమేష్‌ (ఫైల్‌)  - Sakshi

మోత్కూరు: మండలంలోని దత్తప్పగూడెం గ్రామంలో పాముకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ముక్కెర్ల కుమార్‌, మమత దంపతుల కుమారుడు ఉమేష్‌(15) మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో నిద్రిస్తుండగా కట్ల పాము కాటు వేసింది. తనను ఏదో కరిచిందని ఉమేష్‌ తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారు లేచి చూడగా ఏమీ కనిపించలేదు. ఇల్లంతా వెతకగా గ్యాస్‌ సిలిండర్‌ కింద కట్ల పాము కనిపించింది. దానిని కొట్టి చంపారు. ఇంతలోనే ఉమేష్‌ తనకు ఏదోలా అనిపిస్తుందని వాంతులు చేసుకున్నాడు. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వారిని లేపి ఉమేష్‌ను బుధవారం తెల్లవారుజామున చికిత్స కోసం ఆటోలో భువనగిరి జనరల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఉమేష్‌ దత్తప్పగూడెం హైస్కూల్‌లో పదో తరగతి చదువుతూ ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నాడు. కుమార్‌, మమత దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు కాగా ఉమేష్‌ పెద్దవాడు.

లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి రిమాండ్‌

చౌటుప్పల్‌: చిన్నారిపై లైంగిక దాడికి పాల్ప డిన నిందితుడిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మహారాజ్‌గంజ్‌ జిల్లా ఆనంద్‌నగర్‌ పట్టణానికి చెందిన శివ చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని ఓ రసాయన పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆనంద్‌నగర్‌ పట్టణానికే చెందిన మరికొందరితో కలిసి కంపెనీ ఇచ్చిన గదిలోనే ఉంటున్నాడు. అదే గదిలో కొందరు కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఉంటున్నారు. ఈ నెల 25వ తేదీ రాత్రి ఈ గదిలో తల్లి పక్కన నిద్రిస్తున్న రెండన్నరేళ్ల చిన్నారిని శివ బయటకు ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి కటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లారు. ఆ సమయంలో శివ కంపెనీ పరిసర ప్రాంతాలలో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ నిమిత్తం నల్లగొండ జైలుకు తరలించారు.

పురుగుల మందు తాగి ఆత్మహత్య

ఆత్మకూరు(ఎం): పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలంలోని పారుపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పారుపల్లి గ్రామానికి చెందిన పట్టూరి కోటమ్మ, శేఖర్‌ దంపతులకు ఇద్దరు కుమారులు మణికంఠ, శివ(26) సంతానం. మూడేళ్ల క్రితం శేఖర్‌ మృతిచెందగా.. తమ ఇంటి ముందు కిరాణ దుకాణం నడుపుకుంటూ కోటమ్మ, ఇద్దరు కుమారులు జీవనం సాగిస్తున్నారు. బుధవారం కోటమ్మ ఇంటి ముందు కిరాణ దుకాణంలో ఉండగా శివ ఇంట్లో కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగాడు. దీంతో అక్కడే కింద పడిపోగా తల్లి గమనించి చుట్టుపక్కల వారి సహాయంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. కాగా చదువు పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటున్న శివ జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

పట్టూరి శివ (ఫైల్‌)
1/1

పట్టూరి శివ (ఫైల్‌)

Advertisement
Advertisement