
జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు
నర్సాపూర్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించే భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ మహిపాల్ రైతులకు సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు డివిజన్ పరిధిలో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. సదస్సులకు తహసీల్దార్లు హాజరై అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను సదస్సుల్లో అధికారుల దృష్టికి తేవాలని సూచించారు.
నాణ్యమైన విత్తనాలు అమ్మాలి
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అమ్మాలని ఏడీఏ పుణ్య వతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మన గ్రోమోర్, ఆగ్రోస్ రైతుసేవా కేంద్రంతో పాటు పలు ఎరువుల దుకాణాల్లో ఏఓ స్వప్న, ఎస్ఐ రంజిత్రెడ్డితో కలిసి తనిఖీలు నిర్వహించారు. విత్తనాలు, ఎరువులతో పాటు కంపెనీ, లాట్ నంబర్, స్టాక్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రభు త్వం నిషేధించిన విత్తనాలు, పురుగు, గడ్డి మందు అమ్మవద్దని చెప్పారు. రైతులు కొనుగోలు చేసిన వాటికి బ్యాచ్, లాట్ నంబర్ ఉన్న రసీదు ఇవ్వాలన్నారు. కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అర్హత ఆధారంగా
లబ్ధిదారుల ఎంపిక
మెదక్ కలెక్టరేట్: అర్హత ఆధారంగా రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. పథకం కింద వచ్చే సహాయంతో యువత వ్యాపారం చేసి ఉపాధి పొందేలా ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బ్యూటీషియన్ కోర్సులో
ఉచిత శిక్షణ
నర్సాపూర్: నాబార్డు ఆధ్వర్యంలో మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు తెలిపారు. బుధవారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సిబ్బందితో ఆయన ఉచిత శిక్షణపై సమీక్ష నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండి 45 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తారని చెప్పారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల ని సూచించారు. జూన్ మొదటివారంలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని కమిషనర్ వివరించారు. అభ్యర్థులు పదో తరగతి చదివి ఉండాలని, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోను తమ కార్యాలయంలోని మెప్మా సిబ్బందికి అందజేయాలన్నారు. సమావేశంలో జిల్లా మెప్మా పీడీ ఇందిర, కోఆర్డినేటర్ దేవపాల తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు
పాటుపడాలి
రామాయంపేట(మెదక్): ప్రపంచ పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం రోడ్ల పక్కన పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను అటవీ సిబ్బంది తొలగించారు. అక్కక్కన్నపేట బీట్ పరిధిలోని రోడ్డు పక్కన బాటసారులు వేసిన ప్లాస్టిక్ సీసాలను తొలగించి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు