
చివరి గింజ వరకు కొంటాం
కలెక్టర్ రాహుల్రాజ్
రామాయంపేట(మెదక్)/తూప్రాన్/మనోహరాబాద్/చేగుంట: కలెక్టర్ రాహుల్రాజ్ బుధవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడంతో పాటు ఎరువులు, విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. మనోహరాబాద్ మండలంలోని దండుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లు పూర్తి చేసేలా చొరవ చూపించాలని నిర్వాహకులను ఆదేశించారు. ముందస్తు వర్షాలతో ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తున్నాయని తెలిపారు. తడిసిన ధాన్యం కొను గోలు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తూప్రాన్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్మించిన ఇందిరమ్మ ఇంటి నమూనాను పరిశీలించారు. జిల్లాలో 9 వేల మంది ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించామన్నారు. ఎంపీడీఓ భవనం కోర్టు నిర్వహణకు అనుకూలంగా ఉందని, ఎంపీడీఓ కార్యాలయాన్ని ఇంటిగ్రేటేడ్ మార్కెట్లో కొనసాగించేందుకు ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే చేగంటలో ఓ ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు వానాకాలం సీజన్కు సంబంధించి ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వ్యవసాయ, పోలీస్శాఖల సమన్వయంతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం రామాయంపేటలో పర్యటించారు. మల్లె చెరువులోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన మినీ ట్యాంక్బండ్ పనులను పరిశీలించారు. చెరువు సుందరీకరణకు మంచి అవకాశం ఉందని, ఈమేరకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఆయన వెంట వివిధశాఖల అధికారులు, నాయకులు ఉన్నారు.