
చెక్కుల పంపిణీ రసాభాస
● ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రసంగాన్ని
అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
తూప్రాన్: పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ముందుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను మాజీ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారని తెలిపారు. దీంతో కేసీఆర్ విషయం ఈ సమావేశంలో చర్చించవద్దని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో కాసేపు రసాభాస చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్సీ తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా అపేశారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్రెడ్డి, భూంరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మామిళ్ల జ్యోతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.