
పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
టేక్మాల్(మెదక్): అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా సంక్షేమశాఖ అధికారిణి హైమావతి అన్నారు. గురువారం టేక్మాల్, కాద్లూర్ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. వారి బరువును చూసి రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా వచ్చే పౌష్టికాహారాన్ని తల్లులు తింటూనే పిల్లలకు తినిపించాలన్నారు. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆడపిల్లలను అర్ధాంతరంగా చదువులు మాన్పించరాదని, వారి భవితకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు. ఆడపిల్లల పట్ల ఎవరైనా అశ్రద్ధ వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఆమె వెంట సీడీపీఓ పద్మలత, సూపర్వైజర్ కృష్ణవేణి, పోషణ్ అభియాన్ కో–ఆర్డినేటర్ వెంకట్, ఆయా కేంద్రాల అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
డీడబ్ల్యూఓ హైమావతి