బాలాజీ పరిణయం.. నేత్రపర్వం.. | - | Sakshi
Sakshi News home page

బాలాజీ పరిణయం.. నేత్రపర్వం..

Jun 7 2025 12:12 AM | Updated on Jun 7 2025 12:12 AM

బాలాజ

బాలాజీ పరిణయం.. నేత్రపర్వం..

దివ్య కల్యాణాన్ని చూసి తరించిన భక్తజనం

కనువిందు చేసిన రాయబారోత్సవం

దేవేరులతో దర్శనమిచ్చిన స్వామివారు

మామిడికుదురు: పవిత్ర వైనతేయ గోదావరి నదీతీరం అప్పనపల్లి క్షేత్రంలో బాలునిగా కొలువుదీరిన బాలబాలాజీస్వామి దివ్య తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. జ్యేష్ట శుద్ధ ఏకాదశి శుభ ముహూర్తంలో రాత్రి 9.15 గంటలకు శ్రీదేవి, భూదేవిలను స్వామివారు పరిణయమాడారు. కల్యాణానికి ముందుగా స్వామి, అమ్మవార్ల గుణగణాలను భక్తులకు వివరిస్తూ నిర్వహించిన రాయబారోత్సవం (ఎదుర్కోలు సన్నాహం) భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గుణ గణాల్లో స్వామి వారికి అమ్మవార్లు సరిజోడి అంటూ సాగిన ఈ ఉత్సవాన్ని చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన మంటపంలో దేవేరులతో కొలువు తీరిన స్వామివారు భక్తకోటికి సర్వమంగళ రూపంలో దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఆలయ ఉప ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో భక్తుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించి తన్మయులయ్యారు.

కన్నుల పండువగా గ్రామోత్సవం

వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామ స్మరణలు, బాణసంచా కాల్పుల నడుమ స్వామివారిని, దేవేరులను పురవీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. భక్తులు, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది గ్రామోత్సవంలో పాల్గొని పరమానందం పొందారు. భక్తులు స్వామి, అమ్మవార్లకు ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి ఆలయాన్ని పలు రకాల బెంగుళూరు పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలంకరించారు.

ప్రత్యేక ఆకర్షణగా కోలాటం

స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన హరే శ్రీనివాస్‌ కోలాటం ఆహూతులను ఆనంద పరవశుల్ని చేసింది. అలాగే కేరళ వాయిద్యాలు భక్తుల్ని తన్మయత్వంలో ముంచెత్తాయి. అప్పనపల్లికి చెందిన వాణి మహిళా సత్సంగ మిత్ర బృందం సభ్యులు ఆలపించిన శ్రీలలితా విష్ణు సహస్రనామ పారాయణం, మామిడికుదురుకు చెందిన యింటి శ్రీరామ్‌కుమార్‌, సుజాత ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి.

సంతానం కోసం పూజలు

సంతానం లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు శుక్రవారం ఉదయం ధ్వజారోహణం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ ప్రసాదాన్ని తినడం ద్వారా సంతాన యోగం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

బాలాజీ పరిణయం.. నేత్రపర్వం.. 1
1/3

బాలాజీ పరిణయం.. నేత్రపర్వం..

బాలాజీ పరిణయం.. నేత్రపర్వం.. 2
2/3

బాలాజీ పరిణయం.. నేత్రపర్వం..

బాలాజీ పరిణయం.. నేత్రపర్వం.. 3
3/3

బాలాజీ పరిణయం.. నేత్రపర్వం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement