
బరువు తక్కువ పిల్లలకు బాలామృతం
గట్టు: సాధారణం కంటే తక్కువ బరువుతో రెడ్జోన్లో ఉన్న శ్యామ్ పిల్లలకు, సాధారణం కంటే తక్కువ బరువుతో ఆరెంజ్ జోన్లో ఉన్న మామ్ పిల్లలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు తప్పనిసరిగా బాలామృతం ప్లస్ అందించాలని యూనిసెఫ్ ప్రతినిధి, న్యూట్రిషన్ స్పెషలిస్టు ఖ్యాతి అన్నారు. శుక్రవారం మండలంలోని ఆలూరు అంగన్వాడీ కేంద్రంతోపాటు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని కమిషనర్ కార్యాలయం నుంచి డాక్టర్ సౌజన్య, హెల్త్ కమిషనర్ కార్యాలయం నుంచి డాక్టర్ నర్సింహారావు, స్టేట్ కన్సల్టేషన్ యూనిసెఫ్ నుంచి శిరీష్ సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఖ్యాతి మాట్లాడుతూ రెడ్జోన్లో ఉన్న పిల్లలకు 9 బాలామృతం పాకెట్లను అందించి, వాటిని నిరంతరం వాడుకునేలా పర్యవేక్షణ చేయాలన్నారు. అతి తక్కువ బరువు ఉన్న పిల్లలను బాలామృతం తీసుకుంటే సాధారణ స్థితికి చేరుకుంటారన్నారు. ఆరోగ్య ఉప కేంద్రంలో గర్భిణులకు అందజేస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆల్బెండజోల్, ఆమాక్సిలిన్, జింక్ ట్యాబ్లెట్లు, సిరప్స్ అందుబాటులో ఉంచాలని, వాటిని ఆరోగ్య ఉప కేంద్రాలకూ సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాక్సిన్ మేనేజర్ నరేంద్రబాబు, ఎన్సీడీ సమన్వయకర్త శ్యాంసుందర్, డాక్టర్ రమేష్, జిల్లా ఎస్ఎస్ఎఫ్పీ కోఆర్డినేటర్లు పరమేష్, సురేష్, వికాస్, సూపర్వైజర్లు వెంకటేష్, వెంకటాద్రినాయుడు, తాహేరాబేగం తదితరులు పాల్గొన్నారు.