భూపాలపల్లి అర్బన్: ఎస్సీ, స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు, అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిని సునీత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో డిగ్రీ పాసైన ఎస్సీ నిరుద్యోగ యువతి, యువకులు ఈ నెల 30వ తేదీలోపు కలెక్టరేట్లోని కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. మూడు నెలల పాటు ఉచిత భోజన వసతితో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వ సంక్షేమశాఖ ద్వారా శిక్షణ పొందిన వారు అనర్హులని సూచించారు.
ధర్మసమాజ్ పార్టీ
జిల్లా అధ్యక్షుడిగా రవీందర్
భూపాలపల్లి రూరల్: ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొత్తూరి రవీందర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మేకల సుమన్ తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా చిట్యాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కండెరవి, కోశాధికారిగా మహర్షి, కార్యదర్శిగా మందపల్లి హరీశ్, మీడియా ఇన్చార్జ్గా దొమ్మటి రవీందర్లను ఎన్నుకున్నారు. కార్యకర్తలు, పార్టీ నాయకుల సహకారంతో పార్టీని జిల్లాలో బలోపేతం చేస్తానని రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండలాల నాయకులు పాల్గొన్నారు.
కాళేశ్వరాలయంలో
సీపీ పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని వరంగల్ సీపీ అంబర్ కిశోక్ ఝా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం ఆయన నిశి సమయంలో రాగా ప్రధాన మండపం వద్ద గణపతి పూజ చేసుకొని, అక్కడి నుంచి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ఆశీర్వచన వేదిక వద్ద సీపీ దంపతులను స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. ఆయన వెంట కాళేశ్వరం ఎస్సై భవానిసేన్ ఉన్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో పలువురికి గాయాలు
కాటారం: కాటారం మండలకేంద్రం మహదేవపూర్ రహదారి వైపు జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన బంటి ద్విచక్రవాహనంపై గోనె సమ్మయ్యను ఎక్కించుకుని వెళ్తున్నాడు. బైక్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో డివైడర్ను ఢీకొట్టింది. దీంతో సమ్మయ్య తలకు తీవ్ర గాయం కావడంతో పాటు బంటి చేయి విరిగింది. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్లోని ఆస్పత్రికి తరలించారు. రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న మరో ఘటనలో మండలంలోని నస్తూర్పల్లికి చెందిన సంజీవ్, సూరారం గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
పొలిటికల్ సైన్స్ విభాగం
ఇన్చార్జ్ అధిపతిగా వెంకటయ్య
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం నూతన ఇన్చార్జ్ అధిపతిగా ఆ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.వెంకటయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఎస్.నర్సింహాచారి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీరస్వామి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్ధానంలో వెంకటయ్యను నియమించగా, ఈనెల 27న బాధ్యతలు స్వీకరించనున్నారు.