విషపూరిత నురుగులు కక్కుతున్న యమునమ్మ, ఎవరూ పట్టించుకోరే? | Dangerous Froth In Yamuna Surfaces Again, What Causes It And Why It Is So Dangerous? - Sakshi
Sakshi News home page

విషపూరిత నురుగులు కక్కుతున్న యమునమ్మ, ఎవరూ పట్టించుకోరే?

Mar 19 2024 12:42 PM | Updated on Mar 19 2024 1:43 PM

Dangerous Froth inYamuna surfaces again - Sakshi

దేశంలో  ఒక పక్క సార్వత్రిక  ఎన్నికలు,  లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంటోంది.  మరో పక్క రోజు రోజుకి కాలుష్య కాసారంగా మారిపోతున్న  పవిత్ర యమునా నదీ తీరం మరోసారి కాలుష్య సెగలు కక్కుతోంది.  టన్నుల కొద్దీ మురుగునీరు, పారిశ్రామిక, గృహ వ్యర్ధాలతో విషపూరిత నురుగుతో నిండిపోయింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో అనూహ్యంగా పెరిగిపోతున్న కాలుష్యానికి సాక్షీభూతంగా నిలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి.

యమున ఉపరితలంపై విషపూరిత నురుగు తేలుతున్న వీడియోలు గతంలో చాలా సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చాయి .అలాగే కోవిడ్‌ లాక్‌డౌన్‌ కాలంలో యమునకు కాలుష్యం స్థాయి చాలావరకు తగ్గి ప్రశాంతంగా కనిపించడం గమనార్హం.

తీవ్రమైన కాలుష్యంతో యమునా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని దుష్ప్రభావాలు, పొంచివున్న ముప్పుపై  వాతావరణ నిపుణులు, శాస్త్రజ్ఞులు  ఎంత మొత్తుకుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. తక్షణమే కనీస జాగ్రత్తలు చేపట్టాలని కోరుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఢిల్లీ, హర్యానా ,ఉత్తరప్రదేశ్ నుండి శుద్ధి చేయని మురుగునీటిలో ఫాస్ఫేట్లు, సర్ఫ్యాక్టెంట్లు (రసాయన సమ్మేళనాలు) యమునలో కలిసిపోతున్నాయి. ఇదే విషపూరిత నురుగుకు కారణం. ఈ రెండింటిలోనూ  99 శాతం గాలి, నీటిలో కలిసి పోతుంది.ఫలితంగా అనేక బాధలు తప్పవు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు లాంటి సమస్యలొస్తాయి. ఈ రసాయనాలతో  జీర్ణకోశ సమస్యలు ,టైఫాయిడ్ వంటి వ్యాధులు రావచ్చు.  దీర్ఘకాలం పాటు ఈ పారిశ్రామిక కాలుష్య కారకాలకు ఎక్స్‌పోజ్‌ అయితే నరాల సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతాయి. ఒక్కోసారి  ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement