
పారిశుధ్య కార్మికులకు వేతనాలు జమ
● దేవస్థానం అధికారుల ఒత్తిడితో
కాంట్రాక్టర్ చెల్లింపు
● ఊపిరి పీల్చుకున్న 349 మంది సిబ్బంది
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో 349 మంది పారిశుధ్య సిబ్బందికి ఏప్రిల్ నెల వేతనాలు ఎట్టకేలకు చెల్లించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు సిబ్బంది ఖాతాలకు సొమ్ము జమ అయింది. మే నెల గడిచినా ఏప్రిల్ వేతనాలను పారిశుధ్య సిబ్బందికి చెల్లించకపోవడంపై శ్రీవీరి కష్టం తుడిచే వారేరిశ్రీ శీర్షికన మే 26న వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీంతో స్పందించిన దేవస్థానం అధికారులు మే 28న సంబంధిత కనకదుర్గా ఏజెన్సీస్ కాంట్రాక్టర్కు జీతాలు చెల్లించేందుకు రూ.58 లక్షలు చెల్లించారు. మరో రూ.లక్ష తనకు రావాల్సి ఉందని, అది వస్తే కానీ తాను జీతాలు చెల్లించనంటూ కాంట్రాక్టర్ భీష్మించడంతో.. కార్మికుల వేతనాలు మరింత ఆలస్యమయ్యాయి. దీనిపై ఇలాగైతే మేమెలా బతకాలి శీర్షికన సోమవారం సాక్షిలో కథనం ప్రచురితమైంది.
అధికారుల ఒత్తిడి
పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంపై దేవస్థానం అధికారులు కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారమే కార్మికుల అకౌంట్లకు వేతనాలు జమ కావాలని కాంట్రాక్టర్కు స్పష్టం చేయడంతో.. గత్యంతరం లేక ఆదివారం రాత్రి 11 నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు సిబ్బంది అకౌంట్లలో నగదు జమ అయింది. వరుసగా రెండు నెలల జీతాలు ఆలస్యం కావడంపై దేవస్థానం అధికారుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. మే నెల జీతాలైనా జూన్ పది కల్లా చెల్లించేలా చూడాలని పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు.
నలుగురికి అందని వేతనాలు
కాగా, దేవస్థానంలో నలుగురు పారిశుధ్య కార్మికులకు మార్చి వేతనాలు ఇంకా చెల్లించలేదు. గత నెలలో అందరికీ మార్చి వేతనాలు చెల్లించగా, వీరికి అందలేదు. సాంకేతిక కారణాలతో జమ కాలేదని, వచ్చే నెల చెల్లిస్తామని చెప్పినట్లు వారు తెలిపారు. వీరికి మార్చి బకాయి చెల్లంచకుండా, ఏప్రిల్ వేతనాలు మాత్రమే చెల్లించారు.

పారిశుధ్య కార్మికులకు వేతనాలు జమ