
బాకా సరే.. బకాయిల మాటేమిటి?
ఇదీ లెక్క..
జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్
జాబ్కార్డులు : 2.31 లక్షలు
వాడుకలో ఉన్న జాబ్కార్డులు
1.59 లక్షలు
ఉపాధి పనుల్లో పాల్గొన్న కూలీలు
5.42 లక్షలు
జిల్లాలో కూలీల పనిదినాలు
63.48 లక్షలు
వేతన బకాయిలు : రూ.28,87 కోట్లు
● నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక
● సామాజిక పింఛన్ల
పంపిణీ అంటూ ప్రచార ఆర్భాటం
● ఉపాధి కూలీలకు నెలల తరబడి
అందని వేతనాలు
● గోకులాల షెడ్ల పెండింగ్
నిధులు మంజూరు కాని వైనం
● జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మొత్తం బకాయిలు రూ.110.90 కోట్లు
ఆలమూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలం చెయ్యేరులో శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారిక పర్యటన ఖరారైంది. ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టనున్న పనులను ప్రారంభించడంతో పాటు సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తారని అధికార యంత్రాంగం గొప్పగా ప్రచారం చేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఎన్ఆర్ఈజీఎస్ కింద ఉపాధి కూలీలకు కాని, పాడిరైతులకు గాని న్యాయం చేయడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎన్ఆర్జీఈఎస్లో పనిచేస్తున్న కూలీలకు రెండు నెలల నుంచి రూ.కోట్లలో వేతన బకాయిలు ఉన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున ఇప్పటికై నా అధికారులు వేతనాలు మంజూరు చేస్తారని ఎదురు చూసిన కూలీలకు నిరాశే ఎదురైంది. వ్యవసాయ కార్మిక సంఘాలు, సామాజిక వేత్తలు ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతటా అసహనం
పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేసేందుకు ఎన్ఆర్జీఈఎస్ దోహదపడుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న తీరుకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇంకా సక్రమంగా చెల్లింపులు లేక గ్రామాల్లోని అభివృద్ధి ఎండమావిగా మారింది. ఉపాధి హామీ ద్వారా నిర్ణీత సమయానికి ఇప్పటి వరకూ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, రైతులకు రాయితీలను అందించకపోవడం, ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లింపులపై దృష్టి సారించకపోవడంపై అంతటా అసహనం వ్యక్తమవుతోంది. ఎన్ఆర్జీఈఎస్ ద్వారా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక అవి అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో అసంపూర్తి భవనాలు ప్రజా ప్రతినిధులను వెక్కిరిస్తున్నాయి. జిల్లాలోని 22 మండలాల్లో 385 గ్రామాల్లో 2,31,116 జాబ్కార్డులు ఉండగా అందులో 1.59 లక్షలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 5.42 లక్షల మంది కూలీలు ప్రభుత్వం మంజూరు చేసిన 2,385 పనులకు సంబంధించి సుమారు 63.48 లక్షల పని దినాలు పనిచేశారు. వీరందరికి 2025 మే 30 నాటికి ఎన్ఆర్జీఈఎస్ శాఖ సుమారు రూ.28.87 కోట్లు బకాయిలు చెల్లించవలసి ఉందని ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తోంది.
ఉపాధి కూలీల ఆకలి కేకలు
ఆరుగాలం కష్టించి పనిచేసిన ఉపాధి కూలీలకు వేతనాలు సక్రమంగా అందక అర్ధాకలితో అలమటిస్తున్నారు. వేతనాలను మంజూరు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకునే నాథుడు లేడంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కూలీల రోదనను, ఆకలి కేకలను ప్రభుత్వం పట్టించుకోదా అంటూ అధికారులను నిలదీస్తున్నారు. అధికారంలోకి రాగానే కూటమి నేతలు ఆగమేఘాల మీద ఎన్ఆర్జీఈఎస్, పశుసంవర్థకశాఖ అఽధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి నిర్మించిన గోకులాల(పశువుల షెడ్ల)కు ఆరు నెలలైనా బిల్లులు మంజూరు కాలేదు. బిల్లులు వేగంగా అందిస్తామన్న హామీతో అప్పులు చేసి మరీ పనులు చేస్తే నెలలు తరబడినా మంజూరు కాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో మంజూరైన గోకులాలు (పశువుల షెడ్లు) 1,150
ఇప్పటి వరకూ రైతులు నిర్మించుకున్న గోకులాలు 880
లబ్ధిదారులకు మంజూరు చేయాల్సిన నిధులు రూ 7.11 కోట్లు
జిల్లాలో ఇప్పటి వరకూ నిర్మించిన సీసీ రోడ్లు 1,098 కి.మీ
కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులు 74.82 కోట్లు
ఉపాధి బకాయిల కోసం సీఎం చంద్రబాబును కలుస్తాం
జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలకు బకాయి పడ్డ వేతనాల మంజూరు కోసం సీఎం చంద్రబాబును కోనసీమ పర్యటనలో కలుస్తాం. ఎన్ఆర్జీఈఎస్ను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ఉండటంపై కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నందున ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. పనులు లేని కాలంలో ప్రతి వ్యవసాయ కార్మికుడి ఖాతాలో రూ.ఆరు వేలు వేస్తామన్న హామీపై నిలదీస్తాం.
– కారెం వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు, అమలాపురం

బాకా సరే.. బకాయిల మాటేమిటి?

బాకా సరే.. బకాయిల మాటేమిటి?