
ప్రశంసలు పొందిన సేవలు
● గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా పట్టణ, గ్రామ ప్రజలకు, రైతులకు, రోగులకు అందిన సేవలు అద్భుతం. ప్రధానంగా సచివాలయ వ్యవస్థ నిర్మాణం, దాని ద్వారా అందిన సేవలను వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాల ప్రతినిధులు వచ్చి ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వివిధ దేశాలకు చెందిన వారు అభినందనలు కురిపించారు. వీటికి అనుబంధంగా వలంటీర్లు ఉండడంతో ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ ఫలాలు ప్రజల ఇంటి వద్ద గడపలకే వచ్చి చేరాయి. 54 రకాల సేవలు నిరంతరాయంగా అందాయి. చివరకు భూముల రిజిస్ట్రేషన్లు కూడా ఇక్కడ మొదలు పెట్టారు.
● రైతులకు ఆర్బీకేల ద్వారా మేలైన సేవలు అందాయి. తమ గ్రామంలోనే ఉన్న రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వ్యవస్థతో రైతులు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలతోపాటు పంటకు సాంకేతిక సహకారం, ధాన్యం కొనుగోలు, సాగు యాజమాన్య పద్ధతులు వంటివి పొందారు. వీటి ద్వారానే ధాన్యం కొనుగోలు పెద్ద ఎత్తున జరిగింది. కూటమి ప్రభుత్వం సైతం వీటి ద్వారానే కొనుగోలు చేస్తోంది. ఉచిత పంటల బీమా, నష్ట పరిహారం, పంట బీమా పరిహారం ఇలా అన్ని ఆర్బీకేల ద్వారా రైతులకు పెద్ద కష్టం లేకుండా అందాయి.
● విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా సమీపంలోనే మెరుగైన ఆరోగ్యం పొందగలిగారు. గ్రామంలో చిన్నచిన్న రోగాలకు మండల కేంద్రాల్లోని పీహెచ్సీలకు వెళ్లకుండా గ్రామంలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. గతంలో 104 ద్వారా సేవలందించేవారు. హెల్త్ క్లినిక్లు పెట్టడం వల్ల స్థానికంగా వైద్య సదుపాయాలు పెరిగాయి. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండేవారు. జగనన్న సురక్ష ద్వారా వేలాది మంది రోగులకు ఉచిత ఓపీ, ఉచిత మందులు, కళ్లజోళ్లు అందాయి.
● సచివాలయాల ద్వారా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకం, పింఛన్లు, రేషన్కార్డులు, ఇళ్ల స్థలాలు, హౌసింగ్ లోన్లు, ఓటర్ ఐడీలు, 1బీలతో పాటు మరెన్నో సేవలు అందేవి. ఆధార్ అప్డేట్ సచివాలయాల్లో అందుబాటులో ఉండేవి. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సచివాలయాల్లో ప్రతీ రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ పథకాలు, ధ్రువీకరణ పత్రాలు, సేవలన్నీ ప్రజల ముంగిటకే చేరేవి.