
కిక్కిరిసిన విఘ్నేశ్వరుని సన్నిధి
అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారిని బుధవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహానివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 76 మంది, శ్రీ లక్ష్మీగణపతి హోమంలో 29 జంటలు, పంచామృతాభిషేకాల్లో మూడు జంటలు, స్వామివారి గరిక పూజలో ఆరు జంటలు పాల్గొన్నాయి. పది జంటలు స్వామికి ఉండ్రాళ్ల పూజ నిర్వహించారు. స్వామి వారి సన్నిధిలో 16 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, ఆరుగురికి తులాభారం, అన్నప్రాశన పది మంది చిన్నారులకు నిర్వహించారు. స్వామికి 12 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 30 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2,400 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.1,96,054 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.