గిరిజన హస్తకళలకు మహర్దశ
● అమెజాన్ ఇండియాతో విశాఖ అటవీ శాఖ ఒప్పందం ● గిరిజన సంఘాల బలోపేతంపై దృష్టి ● అమెజాన్ కరిగర్ కార్యక్రమం కింద భాగస్వామ్యం ● గిరిజన సాంస్కృతిక పరిరక్షణ, గిరి కళాకారుల సాధికారతకు అవకాశం ● త్వరలోనే అమెజాన్లో గిరిజన హస్త కళాకృతులు, అటవీ ఉత్పత్తుల విక్రయాలువిశాఖ సిటీ: గిరిజన హస్తకళలకు మహర్దశ పట్టనుంది. వారి వారసత్వం, నైపుణ్యం విశ్వవ్యాప్తమవనుంది. గిరిపుత్రుల చేతుల్లో రూపుదిద్దుకున్న కళాకృతులు దేశ ప్రజలకు చేరువకానున్నాయి. గిరిజన కళాకారులకు ఉపాధి కల్పించేందుకు విశాఖ అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. గిరిజనుల హస్త కళాకృతులకు ప్రపంచ మార్కెట్ అవకాశాలు సృష్టించేందుకు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. గిరిజన సమాజ, ఆర్థికాభివృద్ధికి అమెజాన్ కరిగర్ కార్యక్రమం కింద భాగస్వామ్యమైంది. అమెజాన్ ప్లాట్ఫారం ద్వారా గిరిజన కళాకారులు తయారు చేసే వస్తువులు, అటవీ ఉత్పత్తులను ప్రపంచ ప్రేక్షకుల చెంతకు తీసుకువెళ్లనుంది.
అమెజాన్లో గిరిజన ఉత్పత్తులు
త్వరలోనే అమెజాన్ ప్లాట్ఫారంలో విశాఖ గిరిజనుల హస్తకళలు, అటవీ ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభంకానున్నాయి. కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం మధ్యలో ఉన్న శంభువానిపాలెం కుగ్రామంలో నివసించే గిరిజన వర్గాల గొప్ప వారసత్వం, నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో విశాఖ అటవీ శాఖ అధికారులు కీలక అడుగు వేశారు. వారి చేతితో తయారు చేసే వస్తువులకు అమెజాన్ ద్వారా మార్కెట్ కల్పించడం ద్వారా స్థానిక కమ్యూనిటీలకు స్థిరమైన జీవనోపాధిని అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
ఈ–కామర్స్ హబ్ ఏర్పాటు
అమెజాన్ కరిగర్ ప్రోగ్రామ్ కింద గిరిజన సభ్యులకు విలువ జోడింపు, ప్యాకేజింగ్, బ్రాండింగ్ వంటి అంశాల్లో సమగ్ర శిక్షణ అందించనున్నారు. తద్వారా గిరిజన ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. ఇందుకోసం అటవీ శాఖ ద్వారా ఈ–కామర్స్ హబ్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రైమరీ, సెకండరీ ప్యాకేజింగ్, స్టోరేజ్, డిస్పాచ్, ఆర్డర్ ప్రాసెసింగ్తో పాటు వివిధ కార్యకలాపాలకు ఈ హబ్ కీలకమైన కేంద్రంగా పనిచేయనుంది.
తొలుత సంప్రదాయ ఉత్పత్తులపై దృష్టి
అమెజాన్ ప్లాట్ఫారం ద్వారా తొలుత కొన్ని ఉత్పత్తులపైనే దృష్టి సారించనున్నారు. ఇందులో ప్రధానంగా అంతరించిపోతున్న కళారూపాలతో పాటు ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా అందుబాటులో లేని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చే వాటిపై దృష్టి సారించారు. ఆవు పేడతో కుండలు, పేపర్ మాస్క్లు, సంప్రదాయ కళాకృతులను ప్రదర్శించే పోస్ట్కార్డ్లు వంటి అటవీ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా విక్రయించడంపై ఫోకస్ చేయనున్నారు. ప్రస్తుతం అమెజాన్ కరిగర్ ద్వారా దేశ వ్యాప్తంగా 18 లక్షల మంది కళాకారులు తయారు చేసిన రెండు లక్షలకు పైగా చేతి ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గిరిజన కళాకారుల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు లభించడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి దోహదం అవుతుందని విశాఖ అటవీ శాఖ అధికారి అనంత్ శంకర్ తెలిపారు.