గెట్‌ రెడీ.. పంద్రాగష్టుకు ఓలా ఎలక‍్ట్రిక్‌ బైక్‌

Ola Electric Scooters Will Launch On August 15 Said CEO Bhavesh Aggarwal - Sakshi

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న కీలక ఆప్‌డేట్‌ వచ్చేసింది. ప్రీ బుకింగ్స్‌లోనే ప్రపంచ రికార్డు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డెలివరీ ఎప్పుడో తెలిసిపోయింది. ఓలా  స్కూటర్‌ లాంఛింగ్‌ డేట్‌ని ఆ కంపెనీ సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ ప్రకటించారు. 

స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ఆగస్ట్‌ 15న విడుదల చేయబోతున్నట్టు  ఓలా స్కూటర్‌ సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ ప్రకటించారు. "మా స్కూటర్‌ని రిజర్వ్‌ చేసుకున్నవాళ్లందరికీ థ్యాంక్స్‌ ! ఆగస్టు 15వ తేదిన స్కూటర్‌ని లాంచ్‌ చేయబోతున్నాం. స్కూటర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు, విశేషాలను తెలియజేస్తాం" అంటూ భవీశ్‌ అగర్వాల్‌ ట్వీట్‌ చేశారు. 

ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు ట్వీట్‌ ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు భవీశ్‌ అగర్వాల్‌. ఇప్పటికే ఒలా స్కూటర్‌ పది రంగుల్లో ఉంటుందని ప్రకటించగా గరిష్ట వేగం వందకు పైగా ఉంటుందంటూ హింట్‌ ఇచ్చారు.. అదే ఒరవడిలో తాజాగా లాంఛింగ్‌ డేట్‌ను ప్రకటించారు. ఓలా స్కూటర్‌కి సంబంధించి ఒక్కో లీక్‌​ బయటకు వస్తోన్నా.. కీలకమైన ధర విషయంలో ఇప్పటీకీ గోప్యత పాటిస్తున్నారు ఆ కంపెనీ సీఈవో భవీశ్‌ అగర్వాల్‌. ఓలా స్కూటర్‌ ధర ఎంతనే ఆసక్తి అందరిలో నెలకొంది. 

పెట్రోలు రేట్లు భగ్గుమంటుండంతో వాహనదారులు  రెగ్యులర్‌ వెహికల్స్‌ నుంచి ఎలక్ట్రిక్‌ బైక్‌ల వైపు మళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం సైతం ఈవీ వెహికల్స్‌కి భారీగా ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో ఆటోమొబైల్‌ సంస్థలు ఎలక్ట్రిక్‌ బైక్‌ లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్‌ వాహనాలు మార్కెట్‌ లో సందడి చేస్తుండగా.. ఆ జోరును మరింత పెంచేందుకు ఓలా భారీ ఎత్తున ఎలక్ట్రిక్‌ బైక్‌ లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top