
మాటల్లోనే ఇంపు.. ఊరంతా కంపు
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అధ్వానంగా పారిశుద్ధ్యం
నెహ్రూనగర్: నగరంలో ఎక్కడా గార్బేజ్ పాయింట్లు ఉండటానికి వీల్లేదని.. అవి కనిపిస్తే సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీలే బాధ్యత వహించాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. కానీ నగరంలోని పలు చోట్ల గార్బేజ్ పాయింట్లు కనిపిస్తూనే ఉన్నాయి. సకాలంలో ఇంటింటి చెత్త సేకరణ జరగకపోవడంతోపాటు పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానం ఉంది. ఎక్కడ చూసినా వ్యర్థాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చెత్తను రోడ్లపై వేయకుండా గ్రీన్ పట్టాలు కట్టించారు. దీనివల్ల కూడా ఉపయోగం కనిపించడం లేదు. ఫిర్యాదులు రావడంతో కమిషనర్ పులి శ్రీనివాసులు చెత్త వేసే వారిని గుర్తించి వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. పేరుకుపోయిన చెత్తను మాత్రం తొలగించే మార్గాలు అన్వేషించడం లేదు.
నామమాత్రంగా పర్యవేక్షణ
నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు కోసం ప్రత్యేకంగా అధికారులను కేటాయించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సెక్రటరీలతోపాటు ఇంజినీరింగ్, ఇతర విభాగాల అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. ఇంత చేసినా ఆశించిన స్థాయిలో పారిశుద్ధ్యం మెరుగు పడటం లేదు. పర్యవేక్షణ నామమాత్రంగా మారడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం సుమారు 2 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. నెల రోజుల క్రితం అప్కాస్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల వయస్సు 60 ఏళ్లు దాటిందనే సాకుతో వారిని విధుల నుంచి తొలగించారు. వారి స్థానంలో కొత్త వారిని తీసుకోకపోవడంతో మిగిలిన వారిపై పని భారం పడుతోంది. దీంతో పారిశుద్ధ్యం ఆశించిన స్థాయిలో లేదు. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో నగరానికి మెరుగైన స్థానం సాధించేందుకు డంపర్ బిన్లను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో చెత్తను సకాలంలో తరలించేందుకు నగర పరిధిలో 39 ట్రాక్టర్లు, 18 కంప్యాక్టర్ బిన్లను వినియోగిస్తున్నారు. అవసరం పేరుతో అదనంగా కొన్ని ట్రాక్టర్లు అద్దెకు కూడా తీసుకున్నారు. నగరంలో ఉత్పన్నమయ్యే చెత్తను రోడ్ల మీద వేయకుండా ఎప్పటికప్పుడు తరలించాలని కమిషనర్ ఆదేశాలకే పరిమితం అయ్యారు. చెత్త మాత్రం రోడ్డు మీద కనిపిస్తూనే ఉంది. దీనిపై ప్రజారోగ్యధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
శాశ్వత చర్యలు తీసుకుంటేనే..
2011 లెక్కల ప్రకారం నగరంలోని 7.50 లక్షల జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం కార్మికులు పనిచేస్తున్నారు. 2012లో 10 గ్రామ పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేశారు. దీంతో జనాభా మరింత పెరిగింది. ఇప్పుడు నగరంలో సుమారు 11 లక్షల మంది ఉన్నారని అంచనా. ఇళ్ల సంఖ్య సుమారు 3 లక్షల వరకు ఉంది. 2011 జనాభాకు తగ్గట్లుగా 2 వేల మంది మాత్రమే కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. గతంలో నగరంలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల చెత్త వచ్చేది. ప్రస్తుతం 470 మెట్రిక్ టన్నులకు ఇది పెరిగింది. ఇంత చెత్తను బయటకు తీసుకెళ్లేందుకు కార్మికులు చాలా అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రజల నుంచి చెత్త సమస్యలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. కమిషనర్ పులి శ్రీనివాసులు అదనంగా 225 మంది కార్మికులను నిత్యం రూ.500 చొప్పున ఇచ్చేలా నియమించారు. వీరిలో ఎక్కువమంది నామమాత్రంగా పనులు చేసుకుంటూ వెళ్లిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రధానమైన ప్రాంతాల్లోనే పారిశుద్ధ్యం మెరుగ్గా చూపించి, ఇతర కాలనీల్లో గాలికొదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేలా చూడకుండా ౖపైపెన అధికారుల స్థాయిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రయోజనం కనిపించదని నగరవాసులు పేర్కొంటున్నారు. తగినంతమంది సిబ్బందిని నియమించి, పర్యవేక్షణ సక్రమంగా చేస్తేనే చెత్త సమస్యల నుంచి ప్రజలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.
గృహాల సంఖ్య : సుమారు 3 లక్షలు
శానిటరీ డివిజన్లు : 32
మైక్రో ప్యాకెట్లు : 802
నిత్యం వచ్చే చెత్త : 470 మెట్రిక్ టన్నులు
వార్డు సచివాలయాలు : 207
పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య : 2,000
ట్రాక్టర్లు : 39
చెత్త తొలగింపులో మున్సిపల్ యంత్రాంగం దారుణంగా విఫలం అదనంగా కార్మికులను పెట్టామని చెబుతున్నా ఫలితం అంతంతే ఎక్కడ చూసినా గుట్టలుగా పేరుకుపోతున్న వ్యర్థాలతో ప్రజలకు నానా కష్టాలు రోజుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా మెరుగుపడని పరిస్థితి ప్రజారోగ్యంపై ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో రోజురోజుకూ పెరుగుతున్న చెత్త సమస్య
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్యం పడకేసింది. పాలకుల మాటలు చూస్తే ఎంతో ఇంపుగా
ఉంటున్నాయి. ఆచరణలో చూస్తే మాత్రం నగరమంతా దుర్వాసన వచ్చేలా ఎక్కడి చెత్త అక్కడే కుప్పలుగా కనిపిస్తోంది. అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. ప్రజల ఇబ్బందులు తొలగించాలనే ఆలోచన నిజంగానే ఉంటే శాశ్వత చర్యలు తీసుకుంటేనే సమస్య పరిష్కారం
అయ్యే వీలుంటుందని నగరవాసులు
పేర్కొంటున్నారు.
గుంటూరు నగరపాలక సంస్థ సమాచారం