
టీడీపీ వారి గొడవను వైఎస్సార్సీపీకి రుద్దడం తగదు
రాయచోటి టౌన్ : మట్టిని అక్రమంగా తరలించే క్రమంలో టీడీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగితే దానిని కూడా వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ కౌనిల్సర్ ఆనందరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కంచాలమ్మ గండిలో అక్రమంగా మైనింగ్, మట్టి తరలించేందుకు టీడీపీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందన్నారు. కంచాలమ్మ గండిలో జేసీబీతో మట్టిని తవ్వే విషయంలో సుబ్బారెడ్డి, గంగిరెడ్డి మధ్య గొడవ జరిగిందన్నారు. దీంతో జేసీబీ డ్రైవర్, యజమాని అయిన పవన్ అక్కడి నుంచి నిష్క్రమించాడని చెప్పారు. అయినా ఇంటి వద్ద ఉన్న పవన్పై గంగిరెడ్డి కొడవలితో దాడికి దిగాడన్నారు. దీనిపై పోలీసులకు పవన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. మట్టి తరలింపు కోసం గొడవ పడిన వారు ఇద్దరు టీడీపీకి చెందిన వారే కాగా, పవన్ ఇంటిపైకి వెళ్లి దాడి చేయడం తప్పన్నారు. అయితే ఈ కేసును వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అంటగట్టడం తగదన్నారు.
చెస్ క్రీడాకారులకు అంతర్జాతీయ ఫిడే రేటింగ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ చెస్ క్రీడాకారులు అంతర్జాతీయ ఫిడే చెస్ రేటింగ్లను సాధించడం గర్వకారణమని జిల్లా చెస్ సంఘం కార్యదర్శి అనీస్ దర్బారి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ మైదుకూరుకు చెందిన రవి వసంత కుమార్ తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూర్ అలాగే ఢిల్లీలో నిర్వహించిన రెండు ఫిడే క్లాసికల్ రేటింగ్ టోర్నమెంట్లలో పాల్గొని తన అద్భుతమైన ప్రదర్శనతో 1452 క్లాసికల్ ఇంటర్నేషనల్ చెస్ రేటింగ్ను పొందారన్నారు. ప్రస్తుతం ఆయన కాశినాయన మండలం, ఇటుకలపాడు జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారన్నారు.
అలాగే ప్రొద్దుటూరుకు చెందిన నదీమ్ సాహెబ్ గారి ముజమ్మిల్ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఫిడే రాపిడ్ చెస్ టోర్నమెంట్లో పాల్గొని 1491 రాపిడ్ ఇంటర్నేషనల్ చెస్ రేటింగ్ను పొందారన్నారు. ఈ ఇద్దరు క్రీడాకారుల ఫిడే రేటింగులను ఫిడే అంతర్జాతీయ చెస్ సమాఖ్య తమ అధికారిక వెబ్సైట్లో ఈ నెల 1వ తేదీన ప్రకటించిందన్నారు.

టీడీపీ వారి గొడవను వైఎస్సార్సీపీకి రుద్దడం తగదు