
పట్టా భూమి ఆక్రమణపై కలెక్టర్కు ఫిర్యాదు
పెద్దతిప్పసముద్రం : మండలంలోని పులికల్లుకు చెందిన తలారీ ఆదెన్న కుమారుడు తలారీ ఉత్తన్న అనే రైతు గ్రానైట్ క్వారీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై సోమవారం పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. బాధిత రైతు కథనం మేరకు వివరాలిలా... తన కుటుంబానికి వారసత్వంగా వచ్చిన పట్టా భూమిని క్వారీ లీజుదారులు ఆక్రమించుకున్నారని ఆరోపించాడు. అంతేగాక క్వారీ నుంచి వెలువడే పేలుళ్ల శబ్దాల కారణంగా నివాస గృహాలు బీటలు వారడమే గాక రైతుల బోరు బావుల్లోని మోటార్లు కదలి పైపులు పూడుకు పోతున్నా పట్టించుకునే వారు లేరని వాపోయాడు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా క్వారీ పనులను రద్దు చేసేందుకు చొరవ చూపాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపాడు.
మద్యం షాపులో చోరీ
సిద్దవటం : మండలంలోని భాకరాపేట గ్రామ శివారులో ఉన్న శ్రీ కృష్ణ మద్యం షాపులో ఆదివారం రాత్రి చోరీ జరిగిందని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. మద్యం షాపు యజమాని రామసుబ్బారెడ్డి తమ షాపులో రూ. 30 వేలు విలువచేసే మద్య బాటిళ్లు, క్యాష్ కౌంటర్లో ఉన్న రూ. 5వేలు నగదును అహపరించారని ఫిర్యాదు చేశారన్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను పరీశీలించామన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
చిన్నారి నిజాయితీ
రాయచోటి టౌన్ : ఓ చిన్నారి బాలుడు తన నిజాయితీని చాటుకొని అందరినీ అబ్బురపరిచాడు. సోమవారం రాత్రి రాయచోటి పట్టణంలోని విశాల్ మార్ట్కు అబ్దుల్ అలీమ్ తన తండ్రి అబ్దుల్ సమద్తో కలసి షాపింగ్కు వెళ్లాడు. తనకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్న సమయంలో ఆ ఫ్లోర్లో ఐదు గ్రాముల బంగారు ఆభరణం కనిపించింది. ఈ విషయం తన తండ్రికి చెప్పి వెంటనే మార్ట్ మేనేజర్కు అందజేశారు. ఆ ఆభరణాన్ని చూసిన మేనేజర్ ఆ బాలుడిని మెచ్చుకొని ఆలింగనం చేసుకున్నాడు. బాలుడి నిజాయితీని అక్కడున్న ప్రతి ఒక్కరూ అభినందించారు.

పట్టా భూమి ఆక్రమణపై కలెక్టర్కు ఫిర్యాదు