
ఫారంపాండ్ పనుల తనిఖీ
సుండుపల్లె : మండల పరిధిలోని ఈడిగపల్లె, మాచిరెడ్డిగారిపల్లె గ్రామాల్లో నిర్మించిన ఫారంపాండ్, పశువుల నీటితొట్లు, ఊటకుంట పునరుద్ధరణ పనులను డ్వామా పీడీ వెంకటరత్నం బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భూగర్భ జలాలు తగ్గి బోర్లలో నీరు తక్కువ వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా చెట్ల పెంపకానికి ఫారంపాండ్లు, పశువుల దాహార్తిని తీర్చడానికి నీటితొట్లు ఉపయోగపడతాయని తెలిపారు. ఉపాధిహామీ పథకం ద్వారా 5 ఎకరాల్లోపు ఖాళీ భూమి ఉన్న రైతులకు ఉద్యాన శాఖ ద్వారా 24 రకాల ఉద్యాన మొక్కలు పెంచుకొనేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీఓ మాలిక్బాషా, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.