
హత్యాయత్నం కేసులో ఆ నలుగుర్నీ అరెస్ట్ చేయాలి
నర్సీపట్నం: వైఎస్సార్సీపీ యూత్ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై హత్యాయత్నంకు పాల్పడిన మరో నలుగురిని తక్షణమే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం టౌన్ సీఐ గోవిందరావును పార్టీ నాయకులతో కలిసి ఆయన విజ్ఞప్తి చేశారు. రౌడీ షీటర్ పప్పల అప్పలనాయుడు, మరో ఐదురుగు రెండు బైక్లపై వచ్చి హత్యాయత్నంకు పాల్పడ్డారన్నారు. వారందరినీ అరెస్టు చేయకుండా రౌటీషీటర్, మరో వ్యక్తిని అరెస్టు చేసి కేసును నీరుగార్చే పని చేయవద్దన్నారు. కత్తులు, రాడ్లతో ఈశ్వరరావును వెంబడించారని సీఐ దృష్టికి తీసుకెళ్లారు. పాల్ఘాట్ జంక్షన్ నుంచి అబిద్ సెంటర్ వరకు జరిగిన సంఘటన వాస్తవాలు బయటకు రావాలంటే సీసీ ఫుటేజీలను పరిశీలించాలన్నారు. సంఘటన ప్రారంభమైన సీసీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరిపై కేసు పెట్టి సరిపెట్టాలనుకోవడం సరికాదని సీఐకు సూచించారు. అబిద్ సెంటర్లోని సీసీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తే మిగతా నిందితులు దొరుకుతారన్నారు. ఆ ఇద్దరుతో పాటు ఆ నలుగురిని కూడా అరెస్ట్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏకా శివ, పార్టీ లీగల్సెల్ ప్రతినిధులు మాకిరెడ్డి బుల్లిదొర, కౌన్సిలర్ సిరసపల్లి నాని, ఆరుగుల్ల రాజుబాబు, దాడి బుజ్జి తదితరులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డిమాండ్
సీసీ ఫుటేజీలు బయటపెట్టాలి