
రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ వెన్నుపోటు
దేవరాపల్లి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. తారువలో ఆదివారం మాడుగుల నియోజకవర్గ ముఖ్య నాయుకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మోసాలను ఎండగడుతూ 4న మాడుగులలో నిర్వహించే ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రజలు తరఫున కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. కూటమి ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలు సంక్షేమ, అభివృద్ధికి దూరమయ్యారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోను సంక్షేమ పథకాలన్నింటిని నిరాటంకంగా అమలుచేశామని తెలిపారు. జగన్ పాలనలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమాన్ని అందించి ప్రతి ఇంటికి గర్వంగా వెళ్లగలిగామని చెప్పారు. కూటమి పాలనలో సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల చెంతకు వెళ్లలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. మాడుగుల నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారని జిల్లా స్థాయి మినీ మహానాడులో స్వయంగా స్థానిక ఎమ్మెల్యే ఆవేదన వెళ్లగక్కడం కూటమి పాలన తీరుకు నిదర్శనమన్నారు. మహానాడులో ప్రజలకు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండా వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాజీ సీఎం జగన్పై విమర్శలకే పరమితమయ్యారన్నారు. అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు రూ. 20 వేలు, తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ. 15 వేలు ఇస్తామని చెప్పి రైతులను, మహిళలను మోసం చేశారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500, పేదలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు కనీసం ఈ పథకాల ఊసెత్తక పోవడం దారుణమని చెప్పారు. యువతకు 20 లక్షల ఉద్యోగవకాశాలు కల్పిస్తామని, లేకుంటే నిరుద్యోగ భృతి కింద ఏడాదికి రూ. 3 వేలు ఇస్తామని చెప్పి దగా చేశారన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వాయిదాలు వేస్తున్నారని మండిపడ్డారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పిన కూటమి నేతలు చెరకు రైతులకు పేమెంట్లు ఇవ్వకుండా మనుగడ ప్రశ్నార్థకం చేశా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధికి ఐదేళ్లలో జగన్ సుమారు రూ. 90 కోట్లు మంజూరు చేయగా, కూటమి సర్కార్ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు. మైదాన, గిరిజన గ్రామాలకు తారు రోడ్లు నిర్మించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లను నాడు–నేడులో అభివృద్ధి చేశామని చెప్పారు. రైవాడ ప్రాజెక్టును డ్రిప్ స్కీమ్ లో చేర్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, కూటమికి చిత్తశుద్ధి ఉంటే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలన్నారు. పెద్దేరు జలాశయం కెనాల్ ఆధునికీకరణకు గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సుమారు రూ. 84 కోట్లు మంజూరు చేసి టెండర్ పూర్తి చేస్తే, కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జల్జీవన్ మిషన్లో నియోజకవర్గానికి సుమారు రూ. 175 కోట్లు మంజూరు చేసి, ట్యాంక్లు నిర్మించి, పైపులైన్ పనులు సైతం దాదాపుగా పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, వైస్ ఎంపీపీ పంచాడ సింహాచలం నాయుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు, ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, మండల మహిళా అధ్యక్షురాలు గొర్రుపోటు రమాదేవి, మండల బీసీసెల్ అధ్యక్షుడు కిల్లాన శ్రీనివాసరావు, మండల రైతు విభాగం అధ్యక్షుడు అన్నం రామునాయుడు, సర్పంచ్లు నాగిరెడ్డి శఠారినాయుడు, దాడి జగన్, దాసరి సంతోష్కుమార్, ఎంపీటీసీ పోతల వెంకటరావు, రుత్తల రాంబాబు, కాటిపాం పెదనాయుడు, భుగత వెంకటరమణ, వేచలపు చిన్నంనాయుడు, రొంగలి నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ హామీలు అమలులోఘోర వైఫల్యం
నారావారి మోసాలను నిరసిస్తూ 4న ‘వెన్నుపోటు దినం’
మాజీ డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు
తారువలో వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ