
కార్మికురాలి ప్రాణం విలువ రూ.2.5 లక్షలు
ఎస్.రాయవరం: సాయి మైరెన్ పరిశ్రమలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కార్మికురాలికి రూ.2 లక్షల యాభై వేలు వెలకట్టి తల్లికి నష్టపరిహారం ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు అన్నారు. పార్టీ నాయకులతో కలిసి అడ్డురోడ్డులో స్థానిక విలేకర్లతో ఆయన సమావేశమయ్యారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల బాలిక హులకా అనిత బుధవారం రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. బాలిక మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పంచనామాకు విశాఖ కేజీహెచ్కు తరలించారు. అయితే విశాఖలో మృతురాలి తల్లిదండ్రులను మభ్యపెట్టి ఆ నగదు ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. బాలిక మృతికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని, అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడే మెరుగైన వైద్యం అందించాల్సిన పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందన్నారు. సకాలంలో వైద్యం అందిస్తే బాలిక మృతి చెందేది కాదన్నారు. పోలీసులు హత్యానేరంగా కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కార్మిక చట్టాలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు ఎం.రాజేష్, చిరంజీవి, బాబ్జి తదితరులు ఉన్నారు.
కుటుంబ సభ్యులను మభ్యపెట్టి
అరకొర సాయం
సీపీఎం నాయకుడు అప్పలరాజు