ఆయిల్‌పామ్‌ తోటలో గంజాయి డంప్‌ | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ తోటలో గంజాయి డంప్‌

May 30 2025 1:29 AM | Updated on May 30 2025 1:29 AM

ఆయిల్‌పామ్‌ తోటలో గంజాయి డంప్‌

ఆయిల్‌పామ్‌ తోటలో గంజాయి డంప్‌

అనకాపల్లి: పోలీసుల వాహనాల తనిఖీల్లో భారీ స్థాయిలో గంజాయి నిల్వ గుట్టురట్టయింది. కారులో తరలిస్తున్న 150 కేజీల గంజాయి పట్టుబడగా, దీనిపై తమదైన శైలిలో విచారించగా, ఆయిల్‌పామ్‌ తోటలో నిల్వ చేసిన మరో 600 కేజీల గంజాయి లభ్యమైంది. దీంతోపాటు మూడు ద్విచక్రవాహనాలు, ఒక కారు, రూ.2500 స్వాధీనం చేసుకుని, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామున రోలుగుంట, కొత్తకోట ఎస్‌ఐలు పి.రామకృష్ణారావు, ఎం.శ్రీనివాసరావు రోలుగుంట మండలం కొంతలం–అడ్డసరం గ్రామాల్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. మూడు ద్విచక్ర వాహనాలు, కారులో తరలిస్తున్న 150 కేజీలు గంజాయి పట్టుకున్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా రోలుగుంటకు చెందిన వియ్యపు గోవింద్‌ ఆయిల్‌ పామ్‌ తోటలో మరో 600 కేజీల గంజాయి నిల్వ చేసినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గోవింద్‌తోపాటు మాకవరపాలెం మండలానికి చెందిన బంగారు అప్పలనాయుడు ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలిమేలలో పాపులు వెంకటేష్‌ వద్ద 750 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. నాలుగు రోజుల క్రితం 600 కిలోల గంజాయిని తీసుకొచ్చి ఆయిల్‌ పామ్‌ తోటలో నిల్వ ఉంచారు. వీరికి రోలుగుంట మండలానికి చెందిన తమరాన వెంకట శ్రీనివాసరాజా, కడిమి రాకేష్‌, బొడ్డు నానాజీ, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మారిగెల లక్ష్మణ్‌ రెడ్డి, మడుల శివ కుమార్‌ సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్‌ కారులో సీలేరు, మారేడిమిల్లి – తుని ద్వారా రోలుగుంటకు దఫాదఫాలు గంజాయి రవాణా చేస్తున్నారు. తాజాగా 150 కేజీల గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. గతంలో వియ్యపు గోవింద్‌పై నాలుగు, నల్లబిల్లి అంజిబాబుపై రెండు గంజాయి కేసులు నమోదై ఉన్నాయి. అనంతరం గంజాయి కేసులో ప్రతిభ కనబర్చిన రోలుగుంట, కొత్తకోట పోలీస్‌లకు ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. మొత్తం పట్టుబడిన గంజాయి విలువ రూ.37,50,000 ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్‌, ఎల్‌.మోహనరావు, అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వాహనాలు తనిఖీ చేస్తుండగా గుట్టురట్టు

750 కేజీల గంజాయి, 3 ద్విచక్ర వాహనాలు, కారు స్వాధీనం

9 మంది నిందితుల అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement